గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేసి.. ఆస్పత్రిలో మృత్యువుతో కూడా పోరాడి ఓడిపోయారు. బెల్లంకొండకు చెందిన సురేష్, కొమురయ్య అనే ఇద్దరు యువకులు ఈనెల 9 వ తేదీన చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియోను తీసుకుని బంధువులకు పంపిన విషయం తెలిసిందే.
రైల్వె ట్రాక్ పక్కన పడిపోయిన వీరి కోసం వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా మరుసటి దినం సురేష్ చనిపోయాడు. బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్యను మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమురయ్య పరిస్థితి విషమించి ఇవాళ తుది శ్వాస విడిచాడు. ఈ ఘటనపై స్పందించిన బెల్లంకొండ పోలీసులు యువకుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతిరావు, బాజీ అనే ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు బెల్లంకొండ పోలీసులు తెలిపారు.