ప్రేమించిన పాపానికి బలైన బాలిక : భయంతో తప్పుకున్న ప్రియుడు 

ప్రేమించిన పాపానికి బలైన బాలిక : భయంతో తప్పుకున్న ప్రియుడు 

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
భయంతో తప్పుకున్న ప్రియుడు

సరైన వయసు రాకముందే ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోలేని ఆ జంట రైలు కింద పడి చనిపోవాలనుకొని రైలుపట్టాల దగ్గరికి వెళ్లారు. ట్రైన్ దగ్గరకు వస్తుండగా భయంతో ప్రేమించిన ప్రియురాలిని వదిలేసి తప్పుకున్నాడు ప్రియుడు. అమ్మాయి మాత్రం వాడినే నమ్మి ప్రేమించిన పాపానికి రైలు కిందపడి ప్రాణాలను వదిలింది. ఈ దారుణ సంఘటన ఔరంగాబాద్ లో జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అబ్బాయి, 15 ఏళ్ల అమ్మాయి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో.. ఇంట్లో నుంచి పారిపోయారు. బుధవారం వారిద్దరూ రైళ్లో ఔరంగబాద్ చేరుకున్నారు. తమను పెద్దలు విడదీస్తారనే ఆందోళనతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని వారిద్దరూ భావించారు. దౌలతాబాద్ సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లారు. రైలు వేగంగా వస్తుండటంతో భయపడిన ఆ అబ్బాయి చివరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు. కానీ స్పందించేలోగా రైలు దూసుకురావడంతో.. అతడికి గాయాలయ్యాయి. అబ్బాయి ఇలా చేస్తాడని ఊహించని ఆ అమ్మాయి మాత్రం రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది.

ప్రస్తుతం ఆ అబ్బాయి ఔరంగబాద్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అబ్బాయి చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు నిజామాబాద్‌లోని ఇరు కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఔరంగాబాద్ వెళ్లారు. శుక్రవారం ఉదయం పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం అమ్మాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై నిజామాబాద్, దౌలతాబాద్‌ల్లో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ప్రమాదశాత్తూ మరణంగా కేసు నమోదు చేసుకున్న దౌలతాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు.