- క్లియరెన్స్కోసం ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
- నవంబర్ వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం
హైదరాబాద్సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2020లో అప్పటి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఆరేళ్లు గడుస్తున్నా వేలాది దరఖాస్తులు పెండింగ్లోనే ఉండటంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ గడువును నవంబర్ వరకు పొడిగించినప్పటికీ, ఫైళ్ల కదలిక మందకొడిగానే సాగుతోంది.
పెండింగ్ కు ప్రధాన కారణాలు
అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు, సిబ్బంది కొరత వంటి అనేక కారణాల వల్ల ఈ ప్రక్రియ జాప్యమవుతోంది. ముఖ్యంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ), స్థానిక సంస్థల అధికారుల మధ్య సమన్వయం కొరవడటం ప్రధాన సమస్యగా మారింది. కొన్ని మున్సిపాలిటీల విస్తరణ కారణంగా దరఖాస్తుల బదిలీలో గందరగోళం నెలకొంది. మరోవైపు, ఫీజులు చెల్లించాలని నోటీసులు అందుకున్నవారిలో చాలామంది ఇంకా స్పందించకపోవడం కూడా ప్రక్రియకు ఆటంకం కలిగిస్తోంది.
2 లక్షల 69వేల 354 దరఖాస్తులు..
2020 నుంచి ఇప్పటివరకు హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 2,69,354 దరఖాస్తులు అందాయి. ఫీజు చెల్లించాలని 1,82,758 మందికి నోటీసులు జారీ చేయగా, కేవలం 85,655 మంది మాత్రమే చెల్లించారు. ఇంకా 1,35,365 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. అర్హత లేని 2,433 దరఖాస్తులను తిరస్కరించగా, ప్రొసీడింగ్స్కు 35,364 దరఖాస్తులు అర్హత పొందినట్లు అధికారులు చెబుతున్నారు.
10 శాతం ప్లాట్లు విక్రయించిన వాటినే..
2020కి ముందు కొనుగోలు చేసిన భూములు, అక్రమ లేఅవుట్లలో కనీసం 10 శాతం ప్లాట్లు విక్రయించిన వాటిని మాత్రమే తాజా మార్గదర్శకాల ప్రకారం క్రమబద్ధీకరిస్తారు. అయితే, 10 శాతం విక్రయాలు జరగని లేఅవుట్ల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం, క్షేత్రస్థాయి పరిశీలన అవసరమవడం జాప్యానికి మరో కారణం.
దేవాలయ భూములు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, ప్రభుత్వ స్థలాల్లోని ప్లాట్లకు నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేస్తామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
