
లక్నో: భారీ టార్గెట్ ఛేజింగ్లో దుమ్మురేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్–18లో రెండో ప్లేస్తో క్వాలిఫయర్స్–1కు అర్హత సాధించింది. స్టాండిన్ కెప్టెన్ జితేశ్ శర్మ (33 బాల్స్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 85 నాటౌట్), విరాట్ కోహ్లీ (30 బాల్స్లో 10 ఫోర్లతో 54), మయాంక్ అగర్వాల్ (23 బాల్స్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) దంచికొట్టడంతో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్జెయింట్స్పై అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడిన లక్నో 20 ఓవర్లలో 227/3 స్కోరు చేసింది.
రిషబ్ పంత్ (61 బాల్స్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 118 నాటౌట్) ధనాధన్ సెంచరీకి తోడు మిచెల్ మార్ష్ (37 బాల్స్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67) అండగా నిలిచాడు. తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 230/4 స్కోరు చేసి నెగ్గింది. జితేశ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గురువారం జరిగే క్వాలిఫయర్–1లో పంజాబ్తో ఆర్సీబీ పోటీపడనుంది.
పంత్ ఫటాఫట్..
ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో ఇన్నింగ్స్కు పంత్ వెన్నెముకగా నిలిచాడు. ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే (14) ఓ ఫోర్, సిక్స్తో టచ్లోకి వచ్చినా.. మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. 25/1 స్కోరు నుంచి మార్ష్, పంత్ ధనాధన్ షాట్లతో రెచ్చిపోయారు. యష్ దయాల్ వేసిన నాలుగో ఓవర్లో పంత్ 6, 4, 4తో 18 రన్స్ దంచగా, అవతలి వైపు మార్ష్ సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో పవర్ప్లేలో లక్నో 55/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా పంత్ జోరు తగ్గనీయలేదు. భువనేశ్వర్ (1/46) బౌలింగ్లో సిక్స్, ఫోర్ దంచాడు. 9వ ఓవర్లో మార్ష్ సిక్స్ బాదితే, 10వ ఓవర్లో పంత్... సుయాష్ శర్మకు 6, 4, 4 రుచి చూపెట్టాడు. ఈ క్రమంలో 29 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఫలితంగా లక్నో 100/1 స్కోరుతో సగం ఓవర్లను ముగించింది. 11వ ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ కొట్టారు. తర్వాత మరో 4, 6 కొట్టిన మార్ష్ 13వ ఓవర్లో సిక్స్తో 31 బాల్స్లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఇదే ఓవర్లో పంత్ 4, 6 దంచాడు. తర్వాతి ఓవర్లోనూ రెండు సిక్స్లతో 15 రన్స్ రాబట్టడంతో 15 ఓవర్లలో స్కోరు 164/1కి చేరింది. భువీ వేసిన16వ ఓవర్లో మార్ష్ 6, 6 కొట్టి ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్కు 78 బాల్స్లో 152 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ ఓవర్లో పంత్ మరో ఫోర్ కొట్టగా, తర్వాతి ఓవర్లో పూరన్ (13) స్ట్రయిక్ రొటేట్ చేయటంతో తుషారా (1/26) ఏడు రన్స్తో సరిపెట్టాడు. 18వ ఓవర్లో పంత్ 4, 4తో 54 బాల్స్లో సెంచరీ సాధించాడు. 19వ ఓవర్లో పంత్ 4, 6తో 13 రన్స్ రాబట్టాడు. ఆఖరి ఓవర్లో పూరన్ 4 కొట్టి ఔటయ్యాడు. పంత్ సిక్స్తో ఇన్నింగ్స్ ముగించాడు.
జితేశ్ సూపర్ ఫినిషింగ్..
ఛేజింగ్లో ఆర్సీబీకి మెరుపు ఆరంభం దక్కినా.. చివర్లో జితేశ్ సూపర్ ఫినిష్ ఇచ్చాడు. తొలి ఓవర్లో చెరో ఫోర్తో టచ్లోకి వచ్చిన సాల్ట్ (30), కోహ్లీ.. రెండో ఓవర్లో ఐదు బౌండ్రీలు రాబట్టారు. తర్వాత మరో నాలుగు ఫోర్లు కొట్టిన సాల్ట్ను ఐదో ఓవర్లో ఆకాశ్ సింగ్ (1/40) వెనక్కి పంపాడు. ఫస్ట్ వికెట్కు 61 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. 66/1 స్కోరుతో పవర్ప్లేను ముగించిన బెంగళూరుకు 8వ ఓవర్లో కోహ్లీ 6, 4 అండగా నిలిచాడు. కానీ ఇదే ఓవర్లో చివరి రెండు బాల్స్లో రజత్ పటీదార్ (14), లివింగ్స్టోన్ (0) ఔట్కావడంతో ఆర్సీబీ 90/3తో నిలిచింది. వికెట్లు పడినా వెనక్కి తగ్గని కోహ్లీ రెండు ఫోర్లతో 27 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో ఫస్ట్ టెన్లో స్కోరు 115/3కి పెరిగింది. నిలకడగా సాగుతున్న ఇన్నింగ్స్కు 12వ ఓవర్లో కోహ్లీ ఔట్ రూపంలో అతిపెద్ద దెబ్బ తగిలింది.
మయాంక్, జితేశ్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టేందుకు యత్నించారు. 14వ ఓవర్లో 6, 4 కొట్టిన జితేశ్ తర్వాతి ఓవర్లో 4, 6, 4, మయాంక్ 4తో 21 రన్స్ వచ్చాయి. 16వ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన జితేశ్ను దిగ్వేష్ రాఠీ ఔట్ చేసినా నో బాల్ కావడంతో బతికిపోయాడు. ఆ వెంటనే సిక్స్తో 22 బాల్స్లో హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. తర్వాతి బాల్కు అగర్వాల్ను మన్కడింగ్ చేసినా పంత్ ఆ అప్పీల్ను వెనక్కి తీసుకుని క్రీడాస్ఫూర్తిని చూపెట్టాడు. 17 ఓవర్లలో స్కోరు 200/4గా మారింది. ఆర్సీబీ విజయానికి చివరి 18 బాల్స్లో 28 రన్స్ అవసరం కాగా, జితేశ్ 4, 4, 6, 6తో 21 రన్స్ దంచాడు. ఇక ఏడు రన్స్ కావాల్సి ఉండగా సిక్స్తో జితేశ్ విజయాన్ని అందించాడు. మయాంక్–జితేశ్ ఐదో వికెట్కు 45 బాల్స్లో107 రన్స్ జోడించారు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 227/3 (పంత్ 118*, మార్ష్ 67, తుషారా 1/26). బెంగళూరు: 18.4 ఓవర్లలో 230/4 (జితేశ్ 85*, కోహ్లీ 54, ఒరూర్క్ 2/74).
1 ఐపీఎల్లో ఒకే టీమ్ (ఆర్సీబీ) తరఫున 9 వేల రన్స్ చేసిన తొలి ప్లేయర్ కోహ్లీ.
ప్లేఆఫ్స్లో ఎవరితో ఎవరు
క్వాలిఫయర్–1: పంజాబ్X ఆర్సీబీ రేపు
ఎలిమినేటర్: ముంబై-x గుజరాత్-ఎల్లుండి