- సీబీఆర్ఈ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన సిటీలలోనూ లగ్జరీ ఫ్లాట్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయని ఒక రిపోర్టు వెల్లడించింది. జనవరి–మార్చి 2023 మధ్య కాలంలో రూ. కోటి అంతకు మించి విలువైన లగ్జరీ ఫ్లాట్ల సేల్స్ ఏకంగా రెండున్నర రెట్లు పెరిగినట్లు సీబీఆర్ఈ రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది. ఆ కాలంలో మొత్తం 4 వేల లగ్జరీ ఫ్లాట్లు విక్రయమైనట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో చూస్తే లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాలు 1,600 యూనిట్లు మాత్రమేనని వివరించింది. ఢిల్లీ–ఎన్సీఆర్ రీజియన్లో లగ్జరీ ఫ్లాట్ల సేల్స్ మూడు రెట్లు పెరిగి 1,900 యూనిట్లకు చేరాయని సీబీఆర్ఈ తెలిపింది. ముంబైలో 1,150 యూనిట్లకు, పుణెలో 150 యూనిట్లకు, బెంగళూరులో 50 యూనిట్లకు, కోల్కత్తాలో 100 యూనిట్లకు లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాలు పెరిగాయి.
ఇక హైదరాబాద్లోనైతే రూ. 4 కోట్ల పైన విలువుండే లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు ఏకంగా 8 రెట్లు పెరిగాయి. అంతకు ముందు ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో కేవలం 50 యూనిట్లుగా ఉన్న లగ్జరీ ఫ్లాట్ల సేల్స్ ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో 450 యూనిట్లకు చేరుకున్నాయని సీబీఆర్ఈ రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది. కరోనా తర్వాత లగ్జరీ ఫ్లాట్లపై జనంలో ఇష్టం ఎక్కువైందని, దీంతో ఈ సెగ్మెంట్ జోరందుకుందని వివరించింది.
