నల్గొండ, వెలుగు: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని నేషనల్ గ్రీన్ కోర్స్ (ఎన్జీసీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రాజశేఖర్ అన్నారు. ఎస్బీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాల్లో భాగంగా నల్గొండ జిల్లాలో ఎంపికైన స్కూళ్లలో నిర్వహించే అంశాలను ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్పీ రోడ్డులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు వ్యర్థ కాగితాలతో తయారు చేసిన పలు అలంకరణ, జీవశాస్త్ర ప్రాజెక్టులను పరిశీలన చేసి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమ ఇంటి సమీపంలోని వారందరికి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి చైతన్యం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పూర్ణిమా పాల్గొన్నారు.
