
రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు అతని స్థానంలో టెస్ట్ ఫార్మాట్ కు ఎవరు కెప్టెన్ అనే విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఎవరు టీమిండియాను నడిపిస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. రేస్ లో చాలా మంది క్రికెటర్లు ఉన్నప్పటికీ సుదీర్ఘ ఫార్మాట్ కు ఎవరు మంచి ఎంపిక అనే విషయంలో బీసీసీఐ గందరగోళంలో ఉంది. భారత వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ మదన్ లాల్, స్పిన్ దిగ్గజం అనీల్ కుంబ్లే భారత టెస్ట్ జట్టుకు ఎవరు ఉత్తమ ఎంపికో చెప్పారు. గిల్, పంత్ కాకుండా బుమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని వీరిద్దరూ భావిస్తున్నారు.
మదన్ లాల్ మాట్లాడుతూ.. " జస్ప్రీత్ బుమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ అవకాశం ఇవ్వాలి. అతను చాలా బాగా రాణిస్తున్నాడు. అతను జట్టులో రెగ్యులర్ ప్లేయర్. వైస్ కెప్టెన్గా చేయగల కొంతమంది యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. బుమ్రా ఇప్పటికే కెప్టెన్ గా రాణించాడు. రోహిత్ గైర్హాజరీలో ఆస్ట్రేలియాపై పెర్త్లో ఇండియాకు చారిత్రాత్మక టెస్ట్ విజయాన్ని అందించాడు". అని ఈ మాజీ టీమిండియా ప్లేయర్ అన్నాడు. ఇక దిగ్గజ స్పిన్నర్ అనీల్ కుంబ్లే సైతం బుమ్రాకు కెప్టెన్సీ.. గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని సలహా ఇచ్చాడు.
►ALSO READ | PBKS vs DC: ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్కు వర్షం అడ్డంకి.. రద్దయితే కోల్కతా ఇంటికే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం (మే 7) టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న హిట్మ్యాన్ వన్డేల్లో కొనసాగుతానని తెలిపాడు. దీంతో రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే కెప్టెన్సీ చేయనున్నాడు. జూన్ 20న మొదలయ్యే ఈ టూర్ కోసం సెలెక్టర్లు వారంలో టీమ్ను ప్రకటించనుండగా.. కెప్టెన్సీ రేసులో బుమ్రా, రాహుల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు.
ప్రస్తుత వైస్ కెప్టెన్ బుమ్రాకు ఇప్పటికే కొన్ని మ్యాచ్ల్లో జట్టును నడిపించిన అనుభవం ఉంది. కానీ, ఫాస్ట్ బౌలర్ కావడం, తరచూ గాయాలు అవుతున్నందున బుమ్రాను ఫుల్టైమ్ కెప్టెన్ చేసే విషయంలో సెలెక్టర్లు, బోర్డు పెద్దలు వెనకడుగు వేస్తున్నారు. బ్యాటర్గా పంత్లో నిలకడ లేకపోవడం ప్రతికూలం కానుంది. ఈ నేపథ్యంలో రాహుల్, గిల్లో ఒకరికి పగ్గాలు అప్పగించే చాన్స్ కనిపిస్తోంది. దీంతో భారత క్రికెట్ లో తొలిసారి మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లను చూడబోతున్నాం.