
మాదాపూర్, వెలుగు: మాదాపూర్లోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో తొలిసారిగా రోబోటిక్ స్కార్లెట్ థైరాయిడెక్టమీ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. సుడన్కు చెందిన శర్ఫీఫ్ అబ్దుల్లా (50)కు ఈ ఆపరేషన్ చేసినట్లు సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. అజయ్ వరుణ్ రెడ్డి తెలిపారు. హాస్పిటల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆర్ఏబీఐటీ పద్ధతిలో మెడపై ఎలాంటి మచ్చ లేకుండా, చంకలో చిన్న కోత ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించినట్లు చెప్పారు.
48 గంటల్లోనే రోగిని డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు. ఈ అధునాతన టెక్నాలజీ దేశంలోని కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉందని, ఈ సర్జరీతో నొప్పి తక్కువగా ఉండడమే కాకుండా రోగి త్వరగా కోలుకుంటారన్నారు. ముఖ్యంగా మెడ మీద ఎలాంటి మచ్చ కనిపించదని, అందాన్ని కోరుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో మెడికవర్ మేనేజ్మెంట్, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.