హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అవినీతిపరుడ ని కామెంట్ చేసిన ప్రధాని మోదీ.. ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ప్రశ్నించారు. అధికారంలో ఉండి.. అవినీతి జరుగుతున్నదని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఐపీసీ ప్రకారం నేరమే అవుతుందన్నారు. తెలిసీ చర్యలు తీసుకోకుంటే ప్రధాని మోదీ కూడా శిక్షార్హులే అవుతారన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబం అవినీతి ఢిల్లీ దాకా పాకిందంటూ ప్రధాని అదే పాత చింతకాయ పచ్చడి మాటలే చెప్పారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోదీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ‘కేసీఆర్ జూటా.. మోదీ జూటా.. దోనో మిల్కర్ రాష్ట్ర్, దేశ్ కో లూటా’ అంటూ కామెంట్ చేశారు.