- మహబూబాబాద్ ఎస్పీ శబరీష్
మహబూబాబాద్: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. జిల్లాకు 4వేల అత్యాధునిక గంజాయి టెస్టింగ్ కిట్లు చేరాయని, అనుమానితులను పరీక్షిస్తే కేవలం 10 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుందని చెప్పారు. దీంతో గంజాయి వినియోగదారులు, నిల్వదారులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికోసం డీ-అడిక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, విక్రయించడం, రవాణా చేయడం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నేరమని హెచ్చరించారు. గంజాయికి సంబంధించిన సమాచారం 8712656999కు అందించాలని, జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, తొర్రూరు డిఎస్పీ క్రిష్ణ కిషోర్ , తదితరులు పాల్గొన్నారు.
