తెలంగాణలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు బహిరంగంగానే ఆగ్రహానికి గురవుతున్నారు. సంక్షేమ పథకాలు, సమస్యలపై గ్రామాల్లోకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. కురవి మండలంలోని బంగ్య తండాకు వచ్చిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు.
ALSOREAD :రంగంలోకి దిగిన మోదీ ..దిగిరానున్న టమాటా ధరలు..
బంగ్య తండాలో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని గ్రామస్తులు నిలదీశారు. భారీ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తండా నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇద్దరు మహిళలు కాన్వాయ్ కు అడ్డు తగిలి తన నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రావొద్దని అడ్డగించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పోలీసులకు, గ్రామస్తులకు తోపులాట జరిగింది. ఈ సమయంలో కొందరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు.