- మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి
- కేజీబీవీ, పీహెచ్సీల్లో తనిఖీ
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : కేజీబీవీల్లో భోజనం బాగుంటుందా అని స్టూడెంట్స్ను మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి ఆరా తీశారు. బుధవారం భూత్పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ, పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, వారితో కలిసి భోజనం చేస్తూ మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలని సూచిస్తూ, పాఠశాలలో ప్లేగ్రౌండ్, షెడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక పీహెచ్సీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై విచారించారు. ఆస్పత్రిలోని ల్యాబ్, డెలివరీ రూం, మెడిసిన్ వార్డులను తనిఖీ చేశారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఓటరు జాబితా మ్యాపింగ్ను 20 రోజుల్లో పూర్తి చేయాలి
మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్ పనులను వేగవంతం చేసి 20 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కంప్యూటర్ శిక్షణ మందిరంలో అర్బన్ మండల బీఎల్ఓలకు నిర్వహించిన ఆన్-లైన్ ఓటర్ సవరణ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ప్రస్తుతం మహబూబ్నగర్ అర్బన్ మండలంలో కేవలం 38 శాతం మాత్రమే మ్యాపింగ్ పూర్తయిందని, దీనిని వెంటనే 80 శాతానికి పెంచాలని సూచించారు.
2025 తాజా ఓటరు జాబితాను 2002 జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సర్వే చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రోజనీ మ్యాపింగ్ కోసం అవసరమైతే ఇతర నియోజకవర్గాల బీఎల్ఓలను సంప్రదించాలని, పేర్ల తొలగింపులు, చేర్పులు ఉంటే పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఘన్సీరామ్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
