మామిడిపల్లి చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

మామిడిపల్లి  చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
  • రూ.8 లక్షల మహాలక్ష్మి పెన్షన్ డబ్బు రికవరీ
  • బ్రాంచ్​ పోస్ట్ మెన్ ఆధ్వర్యంలో స్కెచ్​     

నిజామాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్ పెన్షన్​ పంచడానికి ఒక బీపీఎం తెచ్చిన డబ్బును చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. దొంగల నుంచి రూ.8 లక్షలు​, టు వీలర్​ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం  నిజామాబాద్​ ఏసీపీ రాజావెంకట్​రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మాక్లూర్​ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బండి నరేందర్​ లోకల్​ పోస్ట్​ ఆఫీస్​లో బ్రాంచ్​ పోస్టుమెన్​గా పనిచేస్తున్నాడు.  మహాలక్ష్మి స్కీమ్​ కింద లబ్ధిదారులకు పెన్షన్​గా పంచడానికి ఆగస్టు 29న నిజామాబాద్ హెడ్​ పోస్టాఫీస్​ నుంచి రూ.8 లక్షలు తెచ్చి రాత్రి ఇంట్లో పెట్టుకున్నాడు.  విషయం తెలుసుకున్న సహ ఉద్యోగి ముబారక్​నగర్​కు చెందిన బీపీఎం పత్తి సాయికుమార్ చోరీకి ప్లాన్​ వేశాడు. 

ఇందుకు నవీపేట మండలం నాగేపూర్​ గ్రామానికి చెందిన కొండమొల్ల రాకేశ్​ను రంగంలోకి దింపాడు. దీంతో మరుసటి రోజు బండి నరేందర్​ వద్దకు కొండమల్ల రాకేశ్ వెళ్లి పత్తి సాయికుమార్ స్నేహితుడినని పరిచయం చేసుకొని రాత్రి అక్కడే ఉన్నాడు. బండి నరేందర్​ నిద్రలోకి జారుకున్నాక డబ్బులు ఉన్న బ్యాగ్​ తీసుకొని ఉడాయించాడు. అనంతరం పత్తి సాయికుమార్​ వద్దకు వెళ్లి డబ్బులున్న బ్యాగ్​ను ఇచ్చాడు. కొన్ని రోజులయ్యాక పంచుకుందామని నిర్ణయించుకున్నారు. 

బాధితుడు బండి నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మాక్లూర్​ పోలీసులు టెక్నికల్​ ఆధారాలతో నిందితులను అరెస్ట్​ చేసి నగదు రికవరీచేయడంతోపాటు రిమాండ్​కు తరలించారు.  కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన నార్త్​ సీఐ బి.శ్రీనివాస్​, ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్స్​ను ఏసీపీ 
అభినందించారు.