భారీ వర్షాలు కురుస్తుండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లు జలమయమైయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు NDRF, ఆర్మీ బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా పని చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర సంగ్లీలో వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో … ఇక్కడి ప్రజలను కాపాడేందుకు NDRF టీంలు తీవ్రంగా శ్రమించాయి. ప్రస్తుతం సంగ్లీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో NDRF బృందాలు అక్కడి నుంచి తిరిగి వెళ్లనున్నాయి. అయితే తమ ప్రాణాలను కాపాడిన NDRF సిబ్బందిపై అక్కడి మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. వారికి పూజలు చేశారు. సిబ్బంది నుదుటిపై తిలకాలు దిద్ది.. వారి చేతికి రాఖీలు కట్టారు. హారతి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సంగ్లీ, కొల్హాపూర్, సతారా జిల్లాలోని 4.5 లక్షల మందిని NDRF సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
