దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు.. జంతువులు అల్లాడిపోతున్నాయి. మహారాష్ట్రలో దాహంతో ఉన్న కోతికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మంచినీళ్లు తాగించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంజయ్ ఘుడే చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Be kind wherever possible ??
— Susanta Nanda IFS (@susantananda3) April 3, 2022
This video of constable Sanjay Ghude is circulating in SM for all the good reasons ?? pic.twitter.com/oEWFC2c5Kx
మహారాష్ట్రకు చెందిన సంజయ్ ఘుడే మల్షేజ్ ఘాట్ ప్రాంతంలో రెండేళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. మల్షేజ్ ఘాట్ పరిసరాల్లో ఎండాకాలంలో కోతులు, కుక్కలు, పిల్లులతో పాటు వివిధ రకాల జంతువులు నీరు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ విషయాన్ని గ్రహించిన సంజయ్ ఘుడే వాటి దాహార్తిని తీర్చాలని నిర్ణయించుకున్నారు. రోజూ తన వెంట వాటర్ బాటిళ్లు తీసుకెళ్లి వాటి దప్పిక తీర్చడం మొదలుపెట్టాడు. ఆయనను చూసి మరికొందరు పోలీసులు సైతం మూగజీవాల దూప తీరుస్తున్నారు.