ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోమవారం శాసనమండలి సభ్యుడి(ఎమ్మెల్సీ) గా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ ముంబైలోని విధాన భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిల్ చైర్మన్ రామ్రాజే నాయక్ నింబాల్కర్.. థాక్రే తో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు ఎన్నికైన మరో ఎనిమిది మంది ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 14 జరిగిన ఎన్నికల్లో వీరంతా పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలుపొందారు. శివసేన నేత నీలం గోర్హే, ఎన్సీపీ నుంచి శశికాంత్ షిండే, అమోల్ మిట్కారి, కాంగ్రెస్ నుంచి రాజేశ్ రాథోడ్, బీజేపీకి చెందిన నలుగురు అభ్యర్థులు రంజిత్ సింహ్ మోహిత్ పాటిల్, గోపీచంద్ పడల్కర్, ప్రవీణ్ దాట్కే, రమేశ్ కరాడ్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ ఎన్నికతో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే(59) శాసన మండలి సభ్యుడిగా అరంగేట్రం చేశారు. పోయినేడాది నవంబర్ 28 న ముఖ్యమంత్రిగా నియమితులైన ఆయన మే 27 లోపు శాసన సభలో సభ్యత్వం పొందవలసి ఉంది.