మహాశివరాత్రి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పరమ శివునికి ఇష్టమైన రోజుగా చెప్పుకునే మహాశివరాత్రి రోజున ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు తెల్లవారు జామునుంచే శివుని దర్శనం కోసం భక్తులు క్యూగట్టారు.వేములవాడ రాజన్న ఆలయం, కొమురవెళ్లిలో, ఏడుపాయల, కాళేశ్వరం, రామప్పదేవాలయం, చెర్వుగట్టు వంటి శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. 

మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జాగరణకు వీలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనుంది. ఈ మహాజాతర కోసం ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. 

సుమారు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఇక్కడ పెద్ద పట్నం వేడుక ఆకట్టుకోనుంది. కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు.

నెట్​వర్క్​, వెలుగు: శివరాత్రి జాతరకు ఆలయాలు ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన శివాలయాలను రంగురంగుల విద్యుత్  దీపాలతో శోభాయమానంగా అంక రించారు. జాతరకు వేలాది మంది భక్తులు తరలిరానున్నందున వివిధ శాఖల అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.  

రాజన్న ఆలయంలో..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాజన్న దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరాగా ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. నేడు రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారం చేసేందుకు భక్తులు చేరుకున్నారు. 

భక్తుల సౌకర్యార్థం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌కుమార్‌‌‌‌ఝా, ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌, ఈవో వినోద్‌‌రెడ్డి తెలిపారు. క్యూలైన్లు, కోడె మొక్కుల లైన్, ధర్మగుండం, ప్రధాన ద్వారం, ప్రసాదం తయారీ కేంద్రం, అంబేద్కర్ కూడలిని పరిశీలించారు. రాత్రి 7గంటల తర్వాత ప్రభుత్వం తరపున స్వామి వారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌, విప్ ఆది శ్రీనివాస్‌‌ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం టీటీడీ తరపున డిప్యూటీ ఈవో లోకనాథం పట్టువస్త్రాలు సమర్పించారు.

కొమురవెల్లిలో..

మహాశివరాత్రికి కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ముస్తాబైంది. జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం, పెద్దపట్నం వేసే తోటబావి ప్రాంగణాన్ని విద్యుత్  దీపాలతో అలంకరించారు. ఆలయ గర్భగుడిలో లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసేందుకు, తోటబావి వద్ద 41 వరుసలతో పెద్దపట్నం నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయం ఘటనలు జరగకుండా సీపీ అనురాధ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

 ఏడుపాయలకు జాతర శోభ..

సహజ ప్రకృతి అందాలతో అలరారే ఏడుపాయలకు జాతర శోభ చేకూరింది. మహాశివరాత్రి సందర్భంగా రాతి గుహలో కొలువై ఉన్న వన దుర్గ భవానీ మాత క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు జాతర జరగనుంది. ఈసారి జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం స్పెషల్  డెవలప్ మెంట్  ఫండ్  నుంచి రూ.2 కోట్లు మంజూరు చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి దామోదర్ రాజనర్సింహ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయల కు 400 ప్రత్యేక బస్ లు నడుపుతున్నారు. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాళేశ్వరంలో..

జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌‌‌‌ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండడం  ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ఆలయం ఆవరణలో జాగరణ చేస్తారు.  

రామప్ప దేవాలయంలో..

ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌ మండలం పాలంపేటలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు రెండు రోజుల పాటు జరగను న్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. శివనామస్మరణ చేస్తూ అగ్నిగుండం నుంచి పరుగెత్తుతారు. శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యం లో ఏర్పాట్లు చేశారు.