ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

అమనగల్లు, వెలుగు : కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని ఉప్పల ట్రస్ట్​ చైర్మన్, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌ చెప్పారు. శుక్రవారం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి  ప్రభుత్వ పాఠశాలలో 185 మంది విద్యార్థులకు స్పోర్ట్స్‌ డ్రెస్‌లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి ట్రస్ట్​ అండగా నిలుస్తోందన్నారు. ఇప్పటికే గూడులేని నిరుపేదలకు ఇండ్ల నిర్మించి ఇవ్వడంతో పాటు ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు.  కరోనా కాలంలో 14500 కిట్ల పంపిణీ  చేసినట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్​రజితా శ్రీనివాస్​ రెడ్డి, తలకొండపల్లి ఎంపీపీ నిర్మల, హెచ్‌ఎం కిషన్​ పాల్గొన్నారు. 

‘తొలిమెట్టు’ను నిర్లక్ష్యం చేస్తే ఊరుకోం

వనపర్తి, వెలుగు:  తొలిమెట్టు  కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా హెచ్చరించారు. శుక్రవారం వనపర్తి మండల పరిధిలోని  పీఎస్ వల్లభ్ నగర్, పీఎస్ చిట్యాల  స్కూళ్లను  సందర్శించారు.  పీఎస్ చిట్యాల స్కూల్‌లో  రికార్డులు సరిగ్గా లేకపోవడం,  స్టూడెంట్లకు బేసిక్స్‌ కూడా రాకపోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.   హెచ్ఎం, నలుగురు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ‘తొలిమెట్టు’ నిర్వహిస్తున్నామని చెప్పారు. టీచర్లు స్పెషల్ ఫోకస్ పెట్టి   పిల్లలకు చదవడం, రాయడం, బేసిక్ మాథ్స్ నేర్పించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి  ప్రత్యేకంగా రీడింగ్ పిరియడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వల్లబ్ నగర్ ప్రైమరీ స్కూల్‌లో  రెండో తరగతి విద్యార్థులకు ఆంగ్ల అక్షరాలు రాయడం, చదవడం, కూడికలు, తీసివేతలు నేర్పించడంతో పాటు  చిన్న చిన్న కథలు కూడా చెప్పారు.  కలెక్టర్ వెంట డీఈవో రవీందర్, ఎంఈవో శ్రీనివాస్‌ గౌడ్  పాల్గొన్నారు.

127 కార్టన్‌ల కర్ణాటక లిక్కర్ పట్టివేత

గద్వాల, వెలుగు: 127 కార్టన్‌ల కర్ణాటక లిక్కర్‌‌ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.  ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ సైదులు వివరాల ప్రకారం..   ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున అయిజ పట్టణంలో రూట్ వాచ్‌ నిర్వహిస్తున్నారు.  నమ్మదగ్గ సమాచారం మేరకు రెండు డీసీఎంలను తనిఖీ చేయగా..  ఒకదాంట్లో 27 కార్టన్‌లు, మరో వాహనంలో 100 కార్టన్‌ల కర్నాటక లిక్కర్‌‌ దొరికింది.  ఏపీలోని నంద్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన బాల పెద్దయ్య,  గట్టు మండలం తుమ్మలపల్లికి చెందిన ఈడిగ రాములు గౌడ్ ,రాయచూరుకు చెందిన వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని  కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.  ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు గోపాల్, పటేల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్, రాజేందర్, కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ బాలయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 
 

పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలె

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: స్టూడెంట్లలో విద్యా సామర్థ్యాలు పెంచాలని  కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచర్ల ప్రైమరీ స్కూల్‌లో  3,4,5 క్లాసుల విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ముగ్గురు నలుగురు మినహా ఎవరికీ చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు రాకపోవడంతో టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిమెట్టు ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్‌ టైమ్‌ పెంచి బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలని సూచించారు.  స్టూడెంట్లకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పి మార్పు తీసుకురావాలన్నారు.  ప్రతినెల మూడో శనివారం బాలసభ నిర్వహించి పిల్లల ద్వారా కథలు చెప్పించడం, రాయించడం లాంటివి చేయాలన్నారు.  అనంతరం మన ఊరు–మనబడి కింద స్కూల్‌లో చేపట్టిన పనులను పరిశీలించారు.  అలాగే జడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. స్కూల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.46 లక్షలు మంజూరైనా పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.  వెంటనే పాత గదులను కూల్చి  కొత్త బిల్డింగ్ నిర్మించాలని ఆదేశించారు.   పీఆర్‌‌ అధికారి దామోదర్ రావు, ఎంఈవో చంద్రుడు, సర్పంచ్ రాధ పాల్గొన్నారు.

భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయాలి

మరికల్​, వెలుగు : రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తోందని జన సమీకరణ కమిటీ రాష్ట్ర చైర్మన్‌ మహేశ్వర్​రెడ్డి ధీమావ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలో రాహుల్​ గాంధీ యాత్ర కొనసాగే ప్రాంతాలను మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌  మల్లురవి, నేతలు ఎర్రశేఖర్​, హర్షవర్దన్​రెడ్డిలతో కలిసి పరిశీలించారు.  కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు 3,500 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతోందని, ఇప్పటి వరకు 1,350 కిలో మీటర్లు పూర్తయ్యిందని చెప్పారు.  రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు.   23న రాష్ట్రంలోకి ఎంటర్‌‌ కానున్నారని,  కాంగ్రెస్ ​కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు జైపాల్​, నిర్మల, పారిజాత, జీఎమ్మార్, అభిజయ్​రెడ్డి, సూర్యమోహన్​రెడ్డి, గొల్ల కృష్ణయ్య, వీరణ్ణ, హరీశ్​, రామకృష్ణ, మల్లేశ్​, అంజిరెడ్డి, మల్​రెడ్డి  పాల్గొన్నారు. 

గల్లంతు కాదు..  వాగులో పడేసిన్రు

అచ్చంపేట, వెలుగు:  లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన సుధాకర్‌‌(45) డిండివాగులో  గల్లంతు కాలేదని,  చనిపోయాక వాగులో పడేశారని సిద్దాపూర్ ఎస్సై గురుస్వామి చెప్పారు. ఆయన వివరాల ప్రకారం.. సుధాకర్, భార్య వెంకటమ్మతో కలిసి హైదరాబాద్‌లోని నేరేడుమెట్‌ వద్ద కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 14న అత్తగారి ఊరైన అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లికి వచ్చారు.  16న పానగల్ మండలం తెల్లరాళ్లపల్లికి చెందిన కాశీం, అమ్రాబాద్ మండలం మన్ననూర్‌ ‌చెందిన కృష్ణ, అచ్చంపేట మండలం సిద్దాపూర్‌‌కు  చెందిన ప్రసాద్, సత్తయ్య, గోపితో కలిసి లింగనోనిపల్లి సమీపంలోని డిండి వాగులో చేపలు పట్టేందుకని వెళ్లారు. కానీ, అంతకన్నా ముందు జోగ్యనాయక్ తండా సమీపంలోని గుట్టపైకి వెళ్లగా.. సుధాకర్‌‌ కాలుజారి కింద పడి చనిపోయాడు.  తామే హత్య చేశామని అనుకుంటారని, వెంట వెళ్లిన వాళ్లు డెడ్‌వాడీని వాగులో పడేశారు.  19న  డెడ్‌బాడీ దొరకగా.. సుధాకర్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం చెప్పారు.  శుక్రవారం ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

రాహుల్ యాత్రతో కాంగ్రెస్​కు పూర్వవైభవం

మరికల్​, వెలుగు :  రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తోందని జన సమీకరణ కమిటీ రాష్ట్ర చైర్మన్‌ మహేశ్వర్​రెడ్డి ధీమావ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలో రాహుల్​ గాంధీ యాత్ర కొనసాగే ప్రాంతాలను మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌  మల్లురవి, నేతలు ఎర్రశేఖర్​, హర్షవర్దన్​రెడ్డిలతో కలిసి పరిశీలించారు.  కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు 3,500 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతోందని, ఇప్పటి వరకు 1,350 కిలో మీటర్లు పూర్తయ్యిందని చెప్పారు.  రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు.   23న రాష్ట్రంలోకి ఎంటర్‌‌ కానున్నారని,  కాంగ్రెస్ ​కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు జైపాల్​, నిర్మల, పారిజాత, జీఎమ్మార్, అభిజయ్​రెడ్డి, సూర్యమోహన్​రెడ్డి, గొల్ల కృష్ణయ్య, వీరణ్ణ, హరీశ్​, రామకృష్ణ, మల్లేశ్​, అంజిరెడ్డి, మల్​రెడ్డి  పాల్గొన్నారు. 

అధిక వర్షాలతోనే పత్తికి తెగుళ్లు

గద్వాల, వెలుగు: అధిక వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే పత్తికి తెగుళ్లు సోకాయని మహబూబ్‌నగర్‌‌  డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణబాబు, సైంటిస్టులు  విజయలక్ష్మి , మహేశ్వరమ్మ  చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఏవో కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల ఫిర్యాదు మేరకు  అలంపూర్, ఉండవెల్లి,  గద్వాల మండలాల్లోని పత్తి పంటలను పరిశీలించామన్నారు.  సెప్టెంబర్‌‌లో 20 రోజులపాటు ఎండలు కొట్టి.. 28 నుంచి భారీ వర్షాలు కురవడంతో వాతావరణంలో మార్పులు వచ్చి రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువైందన్నారు.  ఇందులో పచ్చ దోమ, తామర పురుగు నివారణ కోసం రైతులు 6 నుంచి 12 సార్లు వివిధ రకాల కంపెనీలకు చెందిన మందులు స్ప్రే చేయడంతో మొక్కలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్  పెరగడానికి కారణమైందన్నారు. రైతులు ఒక గ్రూప్ మందును 15 రోజులకు ఒకసారి మాత్రమే పిచికారీ చేయాలని సూచించారు.  వ్యవసాయ అధికారులు సూచించిన మందులు వాడాలే తప్ప.. పర్టిలైజర్‌‌ షాపుల ఓనర్లు ఇచ్చినవి కాదన్నారు.  పూత నిలబడేందుకు కూడా ఎక్కువగా మందులు  వాడొద్దన్నారు.  పూత సహజంగానే రాలుతుందని,  50 శాతం కంటే ఎక్కువ రాలితేనే  మందు కొట్టాలని సూచించారు.  ఈ సమావేశంలో ఏడీఏలు సక్రియా నాయక్,  సంగీతలక్ష్మి ఏఈవోలు పాల్గొన్నారు.

నాలుగు నెలల నుంచి నిధుల్లేవ్

పానగల్, వెలుగు:  నాలుగు నెలల నుంచి నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు సర్పంచులు వాపోయారు. శుక్రవారం పానగల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి  జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల సర్పంచులు నిధులివ్వాలని  నేలపై కూర్చొని నిరసన తెలిపారు.  మాందాపూర్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఓ టీచర్‌‌ను డిప్యూటేషన్‌పై రేవల్లికి పంపారని,  ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి కోరారు. తమకు సమాచారం లేకుండా మహిళా సమాఖ్య మండల, గ్రామ కమిటీలు వేశారని,  వాటిని రద్దు చేసి మళ్లీ వేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం జడ్పీ చైర్మన్‌కు వినతి పత్రం అందించారు.  ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కవిత దశరథ్ నాయుడు, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ యేసయ్య, ఎస్సై నాగన్న  పాల్గొన్నారు.