
టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్న ఆమె ఇవాళ తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య. వీరికి ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేశ్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. కృష్ణ రెండో భార్య విజయ నిర్మల 2019లో చనిపోయారు. కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు 2022 జనవరి 8 న మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది
ఇందిరా దేవి మృతి పట్ల సినీ,రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.