చేవెళ్ల, వెలుగు : ఎంపీ రంజిత్ రెడ్డి కేటీఆర్ బినామీ అని చేవెళ్ల సెగ్మెంట్లో కేటీఆర్, రంజిత్ రెడ్డి ల్యాండ్ ఫూలింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. చేవెళ్ల పార్లమెంట్లో 2 లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలుస్తుందన్నారు. గురువారం రెండో రోజు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేవెళ్ల నుంచి షాబాద్ వరకు సాగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పదో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చిందన్నారు. మరోసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. షాబాద్ మండలంలోని చందన్ వెళ్లిలో పేదల నుంచి 1600 ఎకరాలు అప్పనంగా కాజేసి.. కోట్ల రూపాయలకు పరిశ్రమలకు కేటాయించారని ఆరోపించారు.
సీతారాంపూర్లో 1100 ఎకరాల సీతారామాలయం భూములను టీఎస్ఐఐసీకి అప్పగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, కంజర్ల ప్రకాశ్, ప్రతాప్ రెడ్డి, మల్లారెడ్డి, పాండురంగారెడ్డి, అత్తిలి అనంతరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.