
హైదరాబాద్, వెలుగు: కొత్త మంత్రులు ఆరుగురిలో నలుగురు వలస నేతలే. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వారు కాగా.. మరో ఇద్దరు గతంలో టీడీపీకి చెందిన వారు. సబితా ఇంద్రారెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మూడింట 2 వంతుల సభ్యులు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమవడంతో ఆమె టెక్నికల్గా టీఆర్ఎస్ సభ్యురాలయ్యారు. పువ్వాడ అజయ్ 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. గంగుల కమలాకర్ 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. సత్యవతి రాథోడ్ 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2014లో డోర్నకల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. తర్వాత రెడ్యా టీఆర్ఎస్లో చేరడంతో 2018 ఎన్నికల్లో సత్యవతికి టికెట్ దక్కలేదు.