
మెదక్, వెలుగు: మెదక్ బీఆర్ఎస్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతుండగా.. తాజాగా మైనంపల్లి రోహిత్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు ఉత్కంఠ రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకావడంతో పద్మా దేవేందర్రెడ్డి, కేసీఆర్ఆశీస్సులు ఉండడంతో సుభాష్ రెడ్డి ఈ సారి తమకే టికెట్ వస్తుందన్న ధీమాలో ఉన్నారు. వీరిద్దరి మధ్యలోకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సపోర్ట్ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు రోహిత్ను రంగంలోకి దింపారు. దీంతో ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్ఎస్వో) ద్వారా నెలరోజులుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రెండు వారాలుగా నేతలను హైదరాబాద్కు పిలిపించుకోవడం, ఆయనే వెళ్లి కలవడం చేస్తున్నారు. శుక్రవారం మెదక్, పాపన్నపేటలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వందల బైక్లు, కార్లతో ర్యాలీ తీశారు.
ఎవరి ప్రయత్నాల్లో వారు
పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వ , పార్టీ కార్యక్రమాలతో పాటు క్యాడర్ ఏ ప్రోగ్రామ్ నిర్వహించినా అటెండ్ అవుతున్నారు. ఎల్వోసీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ లాంటి ప్రోగ్రామ్స్ పాటు ఆత్మీయ సమ్మేళనాలతో టచ్లో ఉంటున్నారు. ఏ పంక్షన్కు పిలిచినా వెళ్తున్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కార్యకర్తలతో మీటింగ్లు పెట్టి తనకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఫండ్స్ కింద సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేయడంతో పాటు టెంపుల్స్కు విరాళాలు ఇస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం ఎవరు దరఖాస్తు చేసినా ఇప్పిస్తున్నారు. రోహిత్ ఎంఎస్ఎస్వో ఆధ్వర్యంలో మెదక్ పట్టణంతో పాటు, అన్ని మండలాల్లో ఒక గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకుని కార్పొరేట్ తరహాలో మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టౌన్లోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ను డెవలప్ చేశారు. అలాగే అనాథ పిల్లలను గుర్తించి రూ.25 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. చిన్నశంకరంపేటలో ఇప్పటికే ఈ స్కీం అమలు చేశారు.
పట్టు పెంచుకునే ప్రయత్నాలు
మైనంపల్లి రోహిత్ సోషల్సర్వీస్ చేస్తూనే లీడర్లు, యూత్, వివిధ ఆర్గనైజేషన్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రోహిత్ తండ్రి హన్మంత రావు 2009లో మెదక్ ఎమ్మెల్యేగా పనిచేయడం రోహిత్కు కలిసి వస్తోంది. తండ్రికి ఉన్న పరిచయాల కారణంగా ఇప్పటికే చాలామంది లీడర్లు, కార్యకర్తలు రోహిత్కు మద్దతు తెలుపుతున్నారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్, పలువురు మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. కాగా, ఇదంతా పద్మాదేవేందర్ రెడ్డి చెక్ పెట్టి.. మైనంపల్లి హన్మంతరావు రీ ఎంట్రీ ఇచ్చేందుకేనని ప్రచారం జరుగుతోంది. రంజాన్ సందర్భంగా శుక్రవారం ఎంఎస్ఎస్ఆర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్లు అందించారు. ఈ సందర్భంగా పట్టణంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీలు కవిత, సుభాష్రెడ్డి, మెదక్ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫొటోలతో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ, ఇందులో ఎక్కడ కూడా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఫొటో లేకపోవడం గమనార్హం.
వెనకడుగు వేసేది లేదు : మైనంపల్లి రోహిత్
మెదక్, వెలుగు: మైనంపల్లి సోషల్సర్వీస్ ఆర్గనైజేషన్ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ఎవరు అడ్డుపడ్డా వెనకడుగు వేసేది లేదని సంస్థ చైర్మన్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే హన్మంతరావు కొడుకు డాక్టర్మైనంపల్లి రోహిత్ స్పష్టం చేశారు. శుక్రవారం చిన్నశంకరం పేట నుంచి మెదక్ పట్టణం వరకు వందల బైక్లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాందాస్ చౌరస్థాలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత కోదండ రామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయి బాలాజీ గార్డెన్లో రంజాన్పండగ సందర్భంగా వందల మంది ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయడంతో పాటు పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎస్వో సేవలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చల్లా నరేందర్, మాజీ కౌన్సిలర్లు కొండన్ సురెందర్ గౌడ్, అరునార్తి వెంటకరమణ, తిమ్మన్నగారి అనిల్, మున్నా, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు ముజీబ్, పవన్, రాజేశ్, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.