- రూ.2.45 కోట్ల విలువ గల చోరీ సొత్తు రికవరీ
- పెరిగిన దోషులకు శిక్ష శాతం, 11 కేసుల్లో జీవితఖైదు
- పెరిగిన పోక్సో కేసులు
- వార్షిక నివేదికలో వెల్లడించిన పోలీస్ కమిషనర్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో గతేడాది కంటే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, చైన్ స్నాచింగ్ కేసులు తగ్గాయి. చోరీ కేసుల్లో సొత్తు రికవరీ పెరిగింది. స్వల్పంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ. 4.5 కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించగా, ఇంకో కోటిన్నర బ్యాంకు ఎకౌంట్ లలో ఫ్రీజ్ చేశారు.
2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో కమిషనరేట్ పరిధిలో నేరాలు నియంత్రణలో వున్నాయని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.
రహదారులపై ప్రమాదాలు..!
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. నిద్ర మత్తులో వాహనాలను నడపడం, నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో కొంత మంది మృతిచెందగా, మరికొంతమంది గాయాల పాలయ్యారు. రహదారులు కూడా గుంతలమయంగా మారడంతో వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డులో ఈసారి భారీగానే రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
తగ్గిన దొంగతనాలు..
కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం పోలీసుల పెట్రోలింగ్, నిఘాతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దొంగతనాల కేసులు తగ్గాయి. గత సంవత్సరం రూ.6.64 కోట్లకు పైగా సొత్తును దొంగలు అపహరించగా, ఈ సంవత్సరం రూ.6.04 కోట్లకు పైగా సొత్తు దొంగతనానికి గురైంది.
గత ఏడాది రూ.2.06 కోట్లు సొత్తు రికవరీ చేయగా.. ఈ సంవత్సరం రూ.2.40 కోట్లకు పైగా సొత్తును రికవరీ చేశారు. గత సంవత్సరం 31 శాతం రికవరీ ఉండగా..ఈ సంవత్సరం 40 శాతానికి పెరిగింది. సీసీఎస్ పోలీసులకు సంబంధించి గత సంవత్సరం 84 దొంగతనాల కేసులను ఛేదించగా..ఈసారి 105 కేసులను ఛేదించారు. రికవరీలో వెనుకపడ్డారని చెప్పవచ్చు. గత ఏడాది రూ.66.40 లక్షలు రికవరీ చేయగా..ఈ సారి రూ.55.20 లక్షలు మాత్రమే రికవరీ చేశారు.
కొత్త తరహా లో సైబర్ నేరాలు..!
ఈ సంవత్సరం సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కాయి. ప్రజల దగ్గరి నుంచి నేరగాళ్లు వివిధ పద్ధతుల ద్వారా డబ్బులను కాజేశారు. మొత్తం 2,197 ఫిర్యాదులు రాగా.. 1,805 కేసులు దర్యాప్తులో ఉన్నాయి. ఏడు కేసులను క్లోజ్ చేశారు. గత సంవత్సరం 301 కేసులు నమోదు కాగా..ఈ సంవత్సరం ఏకంగా 384 కేసులు నమోదయ్యాయి.
గత సంవత్సరం రూ.8.23 కోట్లకు పైగా నష్టపోగా..ఈ సారి రూ.15.60 కోట్లకు పైగా ప్రజల సొమ్మును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. గత ఏడాది రూ.37 లక్షలకు పైగానే నేరగాళ్ల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేయగా..ఈ సారి ఏకంగా రూ.4.02కోట్లకు పైగా నగదును సైబర్ క్రైమ్పోలీసులు రికవరీ చేశారు.
పెరిగిన పోక్సో కేసులు
ఈ సంవత్సరం జిల్లాలో పోక్సో కేసులు పెరిగాయి. గత సంవత్సరం ఒకటే పోక్సో కేసు నమోదు కాగా..ఈ సారి ఏకంగా 15 కేసులయ్యాయి. ప్రధానంగా చిన్నారులకు కొంత మేరకు రక్షణ లేకుండా పోయింది. అదేవిధంగా ఈవ్టీజింగ్ కింద కేసులు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాగా పెరిగాయి. గత సంవత్సరం 17 కేసులు ఉండగా.. ఈ సంవత్సరం 41 కేసులు నమోదయ్యాయి. విద్యార్థినులను, మహిళలను ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుండటంతో ఈ కేసుల సంఖ్య పెరిగింది. రేప్ కేసులు సైతం ఈ సంవత్సరం కొంతమేరకు పెరిగాయి. గత సంవత్సరం 74 ఉండగా.. ఈ సంవత్సరం 84 నమోదయ్యాయి.
ఈ ఏడాది పోలీస్ కమిషనేట్ పరిధిలో ఎన్డీపీఎస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం 37 కేసులు ఉండగా..ఈసారి ఏకంగా 95 కేసులు నమోదయ్యాయి. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావడంతో ఎన్డీపీఎస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. గంజాయికి సంబంధించి గత ఏడాది కన్నా ఈ ఏడాది తక్కువగానే పోలీసులు సీజ్ చేశారు. గత ఏడాది 384 కేజీలు సీజ్ చేయగా.. ఈసారి 295 కేజీలు మాత్రమే సీజ్చేశారు. గత సంవత్సరం 855 కేజీల గంజాయిని దగ్ధం చేయగా..ఈసారి 507 కేజీలను పోలీసులు దగ్ధం చేశారు.
ఈ ఏడాది జిల్లాలో జరిగిన నేరాల వివరాలు..
నేరాలు 2024 2025
హత్యలు 28 17
హత్యాయత్నాలు 41 40
దొంగతనాలు 796 723
హత్య+దొంగతనాలు 02 01
చైన్స్నాచింగ్స్ 34 28
రోడ్డు ప్రమాదంలో 312 332.
మృతులు మోసాలు 450 458
మహిళల కేసులు 941 1,146
మహిళలపై వేధింపులు 362 516
రోడ్డు ప్రమాదాలు 879 928
గాయాలు 693 809
మిస్సింగ్ కేసులు 603 705
మహిళల మిస్సింగ్స్ 404 470
కిడ్నాప్ కేసులు 155 226
ఎన్ఫోర్స్మెంట్ 829 817
లోక్అదాలత్లో 18,224 36,709
పరిష్కరించినవి
