IPL 2026: జడేజా కాదు.. రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే..?

IPL 2026: జడేజా కాదు.. రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే..?

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తమ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ను ప్రకటించింది. సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కి మారిన తర్వాత జట్టు నాయకత్వంలో ఈ మేరకు మార్పులు చేసింది జట్టు యాజమాన్యం. 2019లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన పరాగ్, గత ఏడు సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతూ ఫ్రాంచైజీకి నమ్మకస్తుడిగా ఉన్నాడు. యువతకు ప్రాధాన్యం ఇస్తూ, తమ నిబద్దతను టీం మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.


గత ఐపీఎల్ సీజన్‌లో సంజు శాంసన్ గాయపడిన సమయంలో రియాన్ పరాగ్ 8 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2 విజయాలు, 6 పరాజయాలు అతడి సారథ్యంలో ఉన్నాయి. పరాగ్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌ల్లో సగటు 38.57తో రాణించిన పరాగ్, కేకేఆర్ పై 95 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు 84 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రియాన్ 1,566 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేట్ 141.84గా ఉంది. 2024 సీజన్ అతనికి బ్రేక్‌థ్రూ అయ్యింది. ఆ ఏడాది 573 పరుగులు (స్ట్రైక్‌రేట్ 149.21) చేసి మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తన స్థానాన్ని మరింత బలపర్చుకున్నాడు. గత సీజన్‌లో స్ట్రైక్‌రేట్ పెరిగినా, మొత్తం పరుగులు 393కే పరిమితమయ్యాయి.

తనను కెప్టెన్ గా నియామించడంపై రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. రాజస్థాన్ రాయల్స్ నా ఐపీఎల్ కుటుంబం.. మొదటి రోజు నుంచే ఈ ఫ్రాంచైజీ నన్ను ప్రోత్సహించింది.. ఇప్పుడు ఈ జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. కోచింగ్ స్టాఫ్‌తో కలిసి జట్టును నడిపిస్తాను, అభిమానులను గర్వపడేలా చేస్తామని పేర్కొన్నారు. 

►ALSO READ | T20 World Cup: గాల్లో ఎగిరి పక్షిలా క్యాచ్ పట్టిన జింబాబ్వే ప్లేయర్.. నెట్టింట వీడియో వైరల్


మరోవైపు, రియాన్ పరాగ్‌ను జట్టు ప్రధాన కోచ్ కుమార సంగక్కర ప్రశంసించారు. ఈ మేరకు పరాగ్ హై-ఇంపాక్ట్ ప్లేయర్, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడగలడు.. ఆటపై అతనికి మంచి అవగాహన ఉంది.. డ్రెస్సింగ్ రూమ్‌లో అతనికి గౌరవం ఉంటుంది... కెప్టెన్‌గా అతను మరింత రాణిస్తాడని నమ్మకం ఉందని చెప్పారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో ప్లేయర్ ట్రేడ్‌లో భాగంగా రవీంద్ర జడేజా, సామ్ కరన్ లను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. అదే సమయంలో శాంసన్ చెన్నైకి వెళ్లాడు.