- టైలరింగ్ దుకాణంలో చెలరేగిన మంటలు
ఛత్రపతి శంభాజీ నగర్ : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) కంటోన్మెంట్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని టైలరింగ్ దుకాణంలో తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు. ఈ ఘటన గురించి శంభాజీ నగర్ పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా మీడియాతో మాట్లాడారు. "ఉదయం 4 గంటల సమయంలో టైలరింగ్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురించి 4.15 గంటలకు పోలీసులకు తెలిసింది. దకాణం పైన ఒక కుటుంబం నివసిస్తున్న మొదటి అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. ఊపిరాడకపోవడంతో ఏడుగురు మృతి చెందారు. విచారణ తర్వాత అగ్నిప్రమాదానికి గల కారణం
స్పష్టంగా తెలుస్తుంది” అని ఆయన తెలిపారు.