నారాయణపేట, వెలుగు: జడ్పీ మీటింగ్ అంటే పిల్లలాటనా..? ప్రతిప్రతినిధులు పనికిమాలినోళ్లా..? ఇక్కడ నియంత పాలన నడుదవని, తన పదవి పోయినా పర్లేదు.. తానోంటో చూయిస్తానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కలెక్టర్ మీటింగ్కు రాకపోవడంపై ఫైర్అయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అధ్యక్షతన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో ఆఫీస్ సిబ్బంది ఒకరు విద్యాశాఖ ఎజెండా చదువుతుండగా మీటింగ్కు డీఈవో ఎందుకు రాలేదని మక్తల్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. సమావేశాలకు జిల్లా ఆఫీసర్లు ఎందుకు రావడం లేదని, అసలు కలెక్టరే రారని..అడ్మిస్ట్రేషన్ జీరోగా తయారైందని మండిపడ్డారు.
ఇక్కడ మీటింగ్జరుగుతుంటే కలెక్టరేట్లో రహస్య సమావేశాలు చేయటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అందరం కలిసి నెక్ట్స్ మీటింగ్ కలెక్టరేట్లోనే పెడతామని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు పనిచేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తాను జడ్పీ చైర్పర్సన్ తరఫున కొట్లాడుతానన్నారు. సంగంబండ ముంపు బాధితులు సమస్య చెప్పుకుందామని కలెక్టరేట్కు వస్తే పోలీసులు వారిని అరెస్టు చేయటమేంటన్నారు. ఆ వీడియోలను తాను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు చూయించానన్నారు. మక్తల్ నుంచి ఓ మహిళా సర్పంచ్ సమస్య పరిష్కారం కోసం వస్తే కలెక్టర్అగౌరవపరిచారని, అదే బిల్డింగ్పై నుంచి దూకి చస్తానని ఆ సర్పంచ్తనతో చెప్పారన్నారు.
మంత్రి వచ్చినా పట్టించుకుంటలేరు..
మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎన్నోసార్లు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు మక్తల్కు వచ్చినా కలెక్టర్ రాలేరని, దళితబందు ప్రోగ్రామ్స్ను కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మక్తల్కు రాక ఐదు నెలలు అవుతోందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు చెప్పానన్నారు. జిల్లా కేంద్రంలో కోట్ల ఆస్తి అయిన ఎస్ఎల్డీసీ డిగ్రి కాలేజీని ప్రభుత్వానికిచ్చానని, అయినా తమ సొసైటీ బిల్డింగ్దగ్గరికి ఆర్అండ్బీ ఆఫీసర్లను పంపించి రూ.17 కోట్ల పెనాల్టీ కట్టాలని తనకు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం చెందారు. తన ఆస్తి దానం చేసినందుకు రూ.17 కోట్లు ఇవ్వాలా ..? అని ప్రశ్నించారు. కాలేజీ స్థలాన్ని క్రీడాప్రాంగణం కోసం ఆక్రమించారని స్టూడెంట్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి
ఐఏఎస్ ఆఫీసర్లైనా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలని సూచించారు. తాను గతంలో నారాయణపేట ఎమ్మెల్యేగా పనిచేశానని, అధికారులు ఈ విషయం తెలుసుకుని ప్రవర్తించాలని కోరారు. జిల్లా ఆఫీసర్లతో తీరుతో ఇందుకోసమేనా జిల్లా తెచ్చుకున్నదని బాధేస్తుందన్నారు. భారత్మాల స్కీమ్ రైతులకు ఉరితాడులా తయారైందని, భూములు ఇవ్వమని ఎంతమంది రైతులు అప్లికేషన్లు ఇచ్చారో తెలియదా.. ? అని అధికారులను ప్రశ్నించారు. దౌర్జన్యంగా భూములు గుంజుకోవద్దని, రేటు పెంచి నోటిఫికేషన్ ద్వారా భూములు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, విద్య, వైద్యం, మిషన్ భగీరథ, రోడ్లు భవనాలు, అటవీశాఖ, పశు సంవర్ధక శాఖ శాఖలపై వాడివేడీగా చర్చ జరిగింది.
ఆఫీసర్లు ఎంజాయ్ చేస్తున్నరు...
విద్యుత్శాఖ ఆఫీసర్లు దావత్లతో ఎంజాయ్ చేస్తున్నారే తప్ప సమస్యలు పట్టించుకోవడం లేదని ఊట్కూర్ జడ్పీటీసీ అశోక్, దామరగిద్ద ఎంపీపీ నర్సప్ప ఆరోపించారు. ఏదైనా సమస్య చెప్పుకుందాంటే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయరని, ఎందుకు ఎల్సీలు తీసుకుంటారో అర్థం కావడం లేదన్నారు. పేరుకే 24 గంటల విద్యుత్అని, నిత్యం కోతలు విధిస్తున్నారని మరికల్ జడ్పీటీసీ సురేఖ నిలదీశారు. డబ్బులిస్తేనే ట్రాన్స్పార్మర్లను బిగిస్తున్నారని, లేదంటే ప్రైవేటులో అమ్ముకుంటున్నారని జడ్పీటీసీ అశోక్ ఆరోపించారు. డీఈ సంజీవ్రెడ్డి సమాధానమిస్తూ థర్మల్ప్లాంట్లో ప్రాబ్లమ్ ఉన్నందును 24గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోతున్నామన్నారు.
దళిత జడ్పీటీసీని అవమానిస్తారా..?
మండలాల్లో సమస్యలు పరిష్కారం కాకపోతేనే కలెక్టరేట్కు వస్తామని, ప్రజలతో కలిసి కలెక్టరేట్కు వచ్చిన మాగనూర్ జడ్పీటీసీ వెంకటయ్యను అరెస్టు చేయడం సరికాదని ఊట్కూర్ జడ్పీటీసీ అశోక్గౌడ్, కోస్గి జడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లేకుంటే సమావేశాలు జరిగేవి కావని, ఇప్పుడు కలెక్టర్ టైమ్ తీసుకునే సమావేశం పెట్టినా రాకపోవటం ఎంటని ప్రశ్నించారు.
వైరల్ ఫీవర్ ఉండడంతో రాలేరు
కలెక్టర్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, అందుకే జడ్పీ మీటింగ్కు రాలేదని అడిషనల్ కలెక్టర్చంద్రారెడ్డి చెప్పారు. కలెక్టరేట్ ఇంపార్టెంట్ మీటింగులు ఉంటేనే వేరే ప్రోగ్రామ్స్కు రారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్, జడ్పీ డిప్యూటీ సీఈవో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.