దళిత విద్యార్థి మృతికి కారణమైన.. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి  : మాల మహానాడు డిమాండ్

దళిత విద్యార్థి మృతికి కారణమైన.. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి  : మాల మహానాడు డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: దళిత విద్యార్థి మరణానికి కారణమైన విజ్ఞాన్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో బాధిత తల్లిదండ్రులు భానుప్రతాప్, రజిని, సంఘం ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్ తో కలిసి ఆదివారం ఆయన మాట్లాడారు. భూదాన్ పోచంపల్లి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న బొడ్డు శ్యామ్ చరణ్ ఈ ఏడాది ఏప్రిల్ 2న క్వారీ నీటిలో పడి మృతి చెందారన్నారు.

కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ లోపంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపారు. తల్లిదండ్రులు రాకముందే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమ కొడుకు మృతిపై కాలేజీ యాజమాన్యాన్ని వివరణ కోరితే సీఈవో బోయపాటి శ్రవణ్ కుమార్ అవమానకరమైన రీతిలో మాట్లాడారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. తమ కొడుకు క్వారీలో పడినప్పుడు అక్కడ ఉన్న మరో ముగ్గురు విద్యార్థులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.