
- ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ
- మూడేసిసార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సిన పరిస్థితి
- దీనికితోడు ఈపాస్లో సాఫ్ట్వేర్ సమస్యలు
- రాష్ట్రంలో పంపిణీకి 5.58 లక్షల టన్నుల సన్నబియ్యం
- ఈ నెల 30 వరకు పంపిణీ.. ఆందోళన వద్దంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు నెలల రేషన్ పంపిణీ షురూ అయింది. మూడు నెలల రేషన్ ఈ నెలలోనే ఇస్తుండడంతో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దానికితోడు మూడు నుంచి ఆరు సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి వస్తున్నది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ ఇవ్వడానికి పది నిమిషాలకు పైనే పడుతున్నది. దీంతో రేషన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆదివారమే ప్రారంభమైనా.. సోమవారం వేగం పుంజుకున్నది. ఇప్పటికే ప్రతి రేషన్ షాపులో సరిపోను సన్న బియ్యం స్టాక్ను రెడీ చేశారు. స్టాక్ అయిపోయినా వెంటనే సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
5.58 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ
వర్షాకాలం సీజన్ ను దృష్టిలో ఉంచుకొని జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతోపాటు పదేండ్లుగాపెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 91.83 లక్షల రేషన్ కార్డులు ఉండగా 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.
ఒక్కో లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించాల్సి ఉంది. ఒకేసారి మూడు నెలల రేషన్ అందిస్తున్న నేపథ్యంలో ఒక్కో లబ్ధిదారుడికి 18కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అంటే రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు 5.58 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ రైతుల నుంచి మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసిన సన్న వడ్లను మిల్లర్లతో మిల్లింగ్ చేసి సిద్ధం చేశారు. ప్రాథమికంగా వచ్చిన సన్న బియ్యం వచ్చినవి వచ్చినట్లే స్టాక్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 వేల 349 రేషన్ షాపులకు తరలిస్తున్నారు. రేషన్ షాపు కెపాసిటీని బట్టి దఫదఫాలుగా సరఫరా చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆరు సార్లు బయోమెట్రిక్..
మూడు నెలల రేషన్ పంపిణీలో లబ్ధిదారుల నుంచి మూడు నెలలకు సంబంధించి మూడు నుంచి ఆరు సార్లు వేలిము ద్రలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న స్టేట్ రేషన్ కార్డులకు సమస్య లేనప్పటికీ రేషన్ కార్డుల్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అందించే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు సంబంధించి సమస్య ఏర్పడుతున్నది. రాష్ట్రంలో ఉన్న 91.83 లక్షల రేషన్ కార్డుల్లో 55 లక్షల వరకు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉండగా 36 లక్షలకు పైగా స్టేట్ కార్డులున్నాయి.
స్టేట్ కార్డులకు ఒక్కో లబ్ధిదారులకు ఆరు కిలోలు ఇస్తుండగా, సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కో లబ్ధిదారులకు ఐదు కిలోలు మాత్రమే ఇస్తున్నది. వీరికి రాష్ట్రం తరఫున మరో కిలో కలిపి ఇస్తున్నారు. దీంతో ప్రతి నెలా సెంట్రల్ కార్డులున్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు రెండు సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ నెలలో మూడు నెలల రేషన్ను ఒకే సారి ఇస్తుండడంతో ఒక్కో కార్డుదారుడితో ఆరు సార్లు వేలిముద్ర వేయించాల్సి వస్తున్నది. దీంతో ఒక కుటుంబంలో ఐదుగురు లబ్ధిదారులు ఉంటే పంపిణీ చేసే 30 కేజీల రేషన్లో ఎన్ఎఫ్ఎస్ కార్డుదారుల కోసం ఇచ్చే 5 కిలోల చొప్పున 25 కిలోలు, మరో కిలో చొప్పున ఐదు కిలోలు వేర్వేరుగా బయోమెట్రిక్ తీసి తూకం వేసి సన్నబియ్యం ఇవ్వాల్సి వస్తున్నది. దీంతో ఆరు సార్లు బయోమెట్రిల్ తీసుకోవాల్సిన పరిస్థితి.
కొత్త సాఫ్ట్వేర్తో ఈ పాస్లో సమస్యలు
రేషన్ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పీఓఎస్) మెషిన్లో సమస్యలు తలెత్తుతున్నాయి. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం కోసం ఈ పాస్ పరికరాల్లో కొత్తగా సాఫ్ట్ వేర్ను వేశారు. ఈ కొత్త సాఫ్ట్వేర్ స్లోగా రన్ అవడంతో సమస్య ఏర్పడుతున్నది. రేషన్ పంపిణీ చేస్తుండగా పీపాస్ మిషన్ సాఫ్ట్వేర్ సమస్యతో పలు మార్లు లాగ్ ఆఫ్ అవుతున్నది. దీంతో రేషన్ డీలర్లు మళ్లీ మొదటి నుంచి రీసెట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకరికి పంపిణీ చేయగానే బ్యాలెన్స్ సరిగా చూపడడం లేదని రేషన్ డీలర్లు అంటున్నరు.
కొన్ని సార్లు ఎక్కువ, తక్కువ చూపుతున్నదని, కొన్ని సార్లు మైనస్లో చూపిస్తున్నదని చెబుతున్నారు. మే 30, 31తేదీల్లో ఈ పాస్ మెషిన్ ను ట్రయల్ రన్ చేసి సమస్యలు సరిదిద్దినా ఆదివారం మళ్లీ సమస్యలు వచ్చాయి. దీంతో సివిల్ సప్లయ్స్ అధికారులు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కు సమాచారం ఇచ్చి సరి చేస్తున్నారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నరు.