రేషన్​షాపుల ముందు క్యూలు..ఒకేసారి మూడు నెలల రేషన్​తో పరేషాన్​

రేషన్​షాపుల ముందు క్యూలు..ఒకేసారి మూడు నెలల రేషన్​తో పరేషాన్​
  • ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ
  • మూడేసిసార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సిన పరిస్థితి
  • దీనికితోడు ఈపాస్​లో సాఫ్ట్​వేర్​ సమస్యలు
  • రాష్ట్రంలో పంపిణీకి 5.58 లక్షల టన్నుల సన్నబియ్యం
  • ఈ నెల 30 వరకు పంపిణీ.. ఆందోళన వద్దంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు నెలల రేషన్  పంపిణీ షురూ అయింది. మూడు నెలల రేషన్ ఈ నెలలోనే  ఇస్తుండడంతో  సాఫ్ట్​వేర్​ సమస్యలు తలెత్తుతున్నాయి. దానికితోడు మూడు నుంచి ఆరు సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి వస్తున్నది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ ఇవ్వడానికి పది నిమిషాలకు పైనే పడుతున్నది. దీంతో రేషన్​ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేషన్​ పంపిణీ ఆదివారమే ప్రారంభమైనా.. సోమవారం వేగం పుంజుకున్నది. ఇప్పటికే  ప్రతి రేషన్  షాపులో సరిపోను సన్న బియ్యం స్టాక్​ను రెడీ చేశారు.  స్టాక్​ అయిపోయినా వెంటనే సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

5.58 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ

వర్షాకాలం సీజన్ ను దృష్టిలో ఉంచుకొని జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు.  ఇటీవల కొత్త రేషన్​ కార్డులు ఇవ్వడంతోపాటు పదేండ్లుగాపెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 91.83 లక్షల రేషన్​ కార్డులు ఉండగా 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 

ఒక్కో లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున రేషన్​ బియ్యం అందించాల్సి ఉంది. ఒకేసారి మూడు నెలల రేషన్​ అందిస్తున్న నేపథ్యంలో ఒక్కో లబ్ధిదారుడికి 18కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అంటే రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు 5.58 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ రైతుల నుంచి మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్​ ఇచ్చి కొనుగోలు చేసిన సన్న వడ్లను మిల్లర్లతో మిల్లింగ్​ చేసి సిద్ధం చేశారు. ప్రాథమికంగా వచ్చిన సన్న బియ్యం వచ్చినవి వచ్చినట్లే స్టాక్​ పాయింట్​లకు తరలించి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 వేల 349 రేషన్​ షాపులకు తరలిస్తున్నారు. రేషన్​ షాపు కెపాసిటీని బట్టి దఫదఫాలుగా సరఫరా చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.  

ఆరు సార్లు బయోమెట్రిక్..

మూడు నెలల రేషన్​ పంపిణీలో లబ్ధిదారుల నుంచి మూడు నెలలకు సంబంధించి మూడు నుంచి ఆరు సార్లు వేలిము ద్రలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న స్టేట్ రేషన్​ కార్డులకు సమస్య లేనప్పటికీ  రేషన్​ కార్డుల్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అందించే ఎన్​ఎఫ్​ఎస్​ఏ కార్డులకు సంబంధించి సమస్య ఏర్పడుతున్నది. రాష్ట్రంలో ఉన్న 91.83 లక్షల రేషన్​ కార్డుల్లో 55 లక్షల వరకు ఎన్​ఎఫ్​ఎస్​ఏ కార్డులు ఉండగా 36 లక్షలకు పైగా స్టేట్​ కార్డులున్నాయి. 

స్టేట్ కార్డులకు ఒక్కో లబ్ధిదారులకు ఆరు కిలోలు ఇస్తుండగా, సెంట్రల్​ గవర్నమెంట్​ ఒక్కో లబ్ధిదారులకు ఐదు కిలోలు మాత్రమే ఇస్తున్నది. వీరికి రాష్ట్రం తరఫున మరో కిలో కలిపి ఇస్తున్నారు. దీంతో ప్రతి నెలా సెంట్రల్​ కార్డులున్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు రెండు సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ నెలలో మూడు నెలల రేషన్​ను ఒకే సారి ఇస్తుండడంతో ఒక్కో కార్డుదారుడితో ఆరు సార్లు వేలిముద్ర వేయించాల్సి వస్తున్నది. దీంతో ఒక కుటుంబంలో ఐదుగురు లబ్ధిదారులు ఉంటే పంపిణీ చేసే 30 కేజీల రేషన్​లో ఎన్​ఎఫ్​ఎస్​ కార్డుదారుల కోసం ఇచ్చే 5 కిలోల చొప్పున 25 కిలోలు, మరో కిలో చొప్పున ఐదు కిలోలు వేర్వేరుగా బయోమెట్రిక్​ తీసి తూకం వేసి సన్నబియ్యం ఇవ్వాల్సి వస్తున్నది. దీంతో ఆరు సార్లు బయోమెట్రిల్​ తీసుకోవాల్సిన పరిస్థితి. 

కొత్త సాఫ్ట్​వేర్​తో ఈ పాస్​లో సమస్యలు 

రేషన్​ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పీఓఎస్) మెషిన్​లో సమస్యలు తలెత్తుతున్నాయి. మూడు నెలల రేషన్​ ఒకేసారి ఇవ్వడం కోసం ఈ పాస్​ పరికరాల్లో కొత్తగా సాఫ్ట్​ వేర్​ను వేశారు. ఈ కొత్త సాఫ్ట్​వేర్ స్లోగా రన్​ అవడంతో సమస్య ఏర్పడుతున్నది. రేషన్​ పంపిణీ చేస్తుండగా పీపాస్​ మిషన్ సాఫ్ట్​వేర్​ సమస్యతో పలు మార్లు లాగ్ ఆఫ్ అవుతున్నది. దీంతో రేషన్​ డీలర్లు మళ్లీ మొదటి నుంచి రీసెట్​ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకరికి పంపిణీ చేయగానే బ్యాలెన్స్​ సరిగా చూపడడం లేదని రేషన్​ డీలర్లు అంటున్నరు. 

కొన్ని సార్లు ఎక్కువ, తక్కువ చూపుతున్నదని, కొన్ని సార్లు మైనస్​లో చూపిస్తున్నదని చెబుతున్నారు. మే 30, 31తేదీల్లో ఈ పాస్​ మెషిన్​ ను ట్రయల్​ రన్​ చేసి సమస్యలు సరిదిద్దినా ఆదివారం మళ్లీ  సమస్యలు వచ్చాయి. దీంతో సివిల్​ సప్లయ్స్​ అధికారులు నేషనల్​ ఇన్​ఫర్మాటిక్స్​ సెంటర్​ (ఎన్​ఐసీ)కు సమాచారం ఇచ్చి సరి చేస్తున్నారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల 30 వరకు రేషన్​ పంపిణీ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నరు.