
జూబ్లీహిల్స్, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్మల్లన్న)కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య ప్రకటించారు. బంజారాహిల్స్ లోని సంఘం హెడ్డాఫీసులో శుక్రవారం చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. మల్లన్నకు దళిత, బహుజన పట్టభద్రులంతా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు.
క్వశ్చన్పేపర్ల లీకేజీలతో స్టూడెంట్లు, నిరుద్యోగుల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తుందన్నారు. ఆ పార్టీ అభ్యర్థిని ఓడించాలని చెప్పారు. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపూజ రమేశ్, మన్నే శ్రీధర్ రావు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాలూకా రాజేశ్, మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్లొన్నారు.