మాల మాదిగల మధ్య బీజేపీ చిచ్చు : చెన్నయ్య

మాల మాదిగల మధ్య బీజేపీ చిచ్చు :  చెన్నయ్య

ముషీరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళ్తామని ఆయన పేర్కొన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా.. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బుధవారం భారత్ బంద్ లో భాగంగా చెన్నయ్య ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

 ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ.. గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రోద్బలంతో ప్రస్తుత సుప్రీంకోర్టు బెంచ్ ఈ తీర్పును ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఎస్సీ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులతో పాటు చెన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.