బాలింతలనూ కాపాడలేని ప్రభుత్వం: రేవంత్ రెడ్డి

బాలింతలనూ కాపాడలేని ప్రభుత్వం: రేవంత్ రెడ్డి

వైద్యం వికటించి మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన అత్యంత  దారుణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆరోపించారు.  హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కనీసం బాలింతలను కూడా కాపాడలేకపోతోందని విమర్శించారు. వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ వైఖరితోనే కార్పొరేట్ వైద్యం అభివృద్ధి చెందుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా ?  అని కామెంట్ చేశారు.  

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ అపరేషన్ లో ఆపరేషన్ వికటించి 4 గురు బాలింతలు చనిపోయారని రేవంత్ రెడ్డి ఒకప్పటి ఘటనను గుర్తు చేశారు. ఆగస్టు చివరి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి బాలింతలు మృత్యువాత పడ్డారన్నారు. 4 నెలల్లోనే మళ్లీ ఈ సంఘటన జరిగిందని, హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులంటేనే ప్రజలకు భయం వేస్తోందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు మాటలకే పరిమితమయ్యారని, ఈ ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృత్యువాత పడ్డ పేద, బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని కోరారు.