
- పది రోజుల్లో ఇద్దరు మృతి, మరో 15 మంది వరకు బాధితులు
- ముగ్గురికి మలేరియా పాజిటివ్ , బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్న ఆఫీసర్లు
- గ్రామంలో కనిపించని పారిశుధ్యం
అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం జ్వరాలతో మంచం పట్టింది. గత పది రోజుల నుంచి విష జ్వరాల బారిన పడి ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 15 మంది వరకు విషజ్వర బాధితులు ఉన్నారు. మరో గ్రామంలో మూడు మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు.
హాస్పిటల్స్ కు క్యూ కడుతున్న బాధితులు
రెడ్డిగూడెంలో విష జ్వర బాధితులు రోజురోజుకు పెరుగుతుండడంతో హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామానికి చెందిన అన్నదమ్ములైన ఉమ్మల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి జ్వరంతో మంచాన పడ్డారు. అలాగే ఉమ్మల బాపిరెడ్డి, ఉమ్మల రాజిరెడ్డి, లచ్చిరెడ్డి, బొల్లు వెంకటేశ్వర్ రెడ్డి, గణేశ్ రెడ్డి, యాట్ల సంధ్య, చిప్పల రమణారెడ్డితో పాటు మరికొంతమందికి విషజ్వరాలు సోకడంతో వారం రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. బాధితులకు సడన్ గా ప్లేట్ లెట్లు పడిపోవడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మండలంలోని దురదపాడు, పెద్దమిద్దె, సుద్దగోతులగూడెం, గాడ్రాల, కావడిగుండ్ల, ఆసుపక గ్రామాల్లో సైతం విషజ్వర బాధితులు పెరుగుతున్నారు. స్పందించిన ఆఫీసర్లు గ్రామాల్లో దోమల మందు పిచికారి చేయడంతో పాటు హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తూ బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు.
గ్రామాల్లో కనిపించని పారిశుధ్యం
గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. ఎక్కడ చూసినా మురుగు నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతుంది. శానిటేషన్ పనులు చేపట్టాలని ఎన్నిసార్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగినా నిధులు లేవంటూ చెబుతున్నారని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం మొదట్లోనే ఇలా ఉంటే.. ముందు ముందు పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి దోమ తెరలు పంపిణీ చేయడంతో పాటు పారిశుధ్య పనులు చేపట్టి, దోమల మందులను పిచికారి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
శానిటేషన్ పనులు చేయాలని ఆదేశించాం
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని సెక్రటరీలను ఆదేశించాం. రెడ్డిగూడెంలో సైతం శానిటేషన్ పనులను చేపడుతున్నాం. పరిసరాలను క్లీన్ గా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో, అశ్వారావుపేట
హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం
రెడ్డిగూడెం గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి రక్త నమూనాలను సేకరిస్తున్నాం. అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నాం. రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిసత్తుపల్లి ప్రైవేట్ హాస్పిటల్ లో చనిపోయాడు. అతడి రిపోర్ట్ లు తీసుకొని పరిశీలించగా లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధితో చనిపోయినట్లు తెలిసింది.
డాక్టర్ రాందాస్ నాయక్ , వినాయకపురం పీహెచ్ సీ