
ప్రముఖ మలయాళ సినీ, సీరియల్ నటుడు విష్ణు ప్రసాద్ కన్నుమూశారు. కాలేయ వ్యాధి సమస్యల కారణంగా ఎర్నాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించాడు. చాలా రోజులుగా చికిత్స పొందుతున్న విష్ణు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి (మే 1న) తుది శ్వాస విడిచారు.
ఈ విషయాన్నీ ఆయన తోటి నటుడు కిషోర్ సత్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన బాధను వ్యక్తం చేశాడు. విష్ణు ప్రసాద్ కెరీర్లో 'కాశి' మరియు 'రన్వే' వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు. మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) మరియు ATMA లలో చురుకైన సభ్యుడిగా నటుడు విష్ణు ప్రసాద్ పేరుగాంచారు. విష్ణు ప్రసాద్ మృతికి మలయాళ టెలివిజన్ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది.
విలన్ పాత్రలతో గుర్తింపు:
విష్ణు ప్రసాద్, సినిమాలు మరియు సీరియల్స్ లో విలన్ పాత్రలకు మంచి గుర్తింపు పొందారు. వినయన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కాశి' ద్వారా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వత 'కై ఎతుమ్ దూరత్', 'రన్ వే', 'మాంపఝక్కళం', 'లయన్', 'బెన్ జాన్సన్' మరియు అనేక మలయాళ చిత్రాలలో నటించారు.