అధికారులకు జైలుశిక్ష అమలుపై స్టే

అధికారులకు జైలుశిక్ష అమలుపై స్టే

మల్లన్నసాగర్​ కేసులో హైకోర్టు డివిజన్​ బెంచ్​ ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: మల్లన్నసాగర్‌‌ రైతుల పరిహారానికి సంబంధించిన కేసులో జైలుశిక్ష పడిన ముగ్గురు అధికారులకు హైకోర్టు డివిజన్​ బెంచ్​ ఊరట కల్పించింది. కోర్టు ధిక్కార కేసులో సింగిల్​ జడ్జి విధించిన జైలుశిక్ష అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. మల్లన్నసాగర్‌‌ ముంపు ప్రాంతాల పరిహారం విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ గతంలో సిద్దిపేట జిల్లా వేములఘాట్‌‌ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసులో తాను ఆదేశాలను అమలు చేయకపోవడంతో సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, తొగుట తహసీల్దార్‌‌ వీర్‌‌ సింగ్, గజ్వేల్‌‌ ఇంజనీరింగ్‌‌ సూపరింటెండెంట్​ వేణులకు సింగిల్​ జడ్జి మూడు నెలల జైలుశిక్ష విధించారు. దీనిపై వారు అప్పీలు చేసుకోగా.. చీఫ్​ జస్టిస్​ ఆర్ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది. సింగిల్‌‌ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.