
- రేప్ ఆరోపణలను కొట్టివేస్తూ, బెయిల్ ఇచ్చిన కోర్టు
కౌశాంబి(యూపీ): ఎనిమిదేండ్ల బాలికపై అత్యాచారం చేశాడంటూ తన కొడుకుపై మోపిన ఆరోపణలు అబద్ధమేనని నిరూపించేందుకు ఓ తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆఖరికి, చెయ్యని నేరానికి తన కొడుకుపై కేసును మోపారన్న ఆవేదనతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది జరిగిన వారం తర్వాత కొడుకు ఎలాంటి నేరం చేయలేదంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) రిపోర్టు ఇచ్చింది. అతడు ఇంతకాలం ఎదుర్కొన్న ఆరోపణలన్నీ అబద్ధమేనని తేల్చింది. అవన్నీ పగతో మోపిన నిందలేనని కన్ఫామ్ చేసింది. దీంతో అత్యాచార ఆరోపణలను, పోలీసులు పెట్టిన పోక్సో కేసును కొట్టివేసిన కోర్టు నిందితుడు సిద్ధార్థ్ తివారీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తు రిపోర్టు ఆలస్యం కాకపోయి ఉంటే తన తండ్రి బ్రతికి ఉండేవారని సిద్ధార్థ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఏం జరిగిందంటే..
మే28న తన కూతురుపై యూపీలోని కౌశాంబి జిల్లాకు చెందిన ధున్నూ అలియాస్ సిద్ధార్థ్ తివారీ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తివారీని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో కేసు పెట్టి రిమాండ్లో ఉంచారు. కేసు విచారణకు సిట్ ను ఏర్పాటు చేయగా.. బాలికను నిందితుడు చెంపపై మాత్రమే కొట్టాడని, లైంగిక దాడి చేయలేదని సిట్ తేల్చింది.
సోమవారం విచారణ చేపట్టిన చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సిట్ రిపోర్టును పరిశీలించి, ఎఫ్ఐఆర్ నుంచి పోక్సో యాక్ట్ కింద అభియోగాలను తొలగిస్తూ, నిందితుడికి బెయిల్ ఇచ్చింది. కానీ, తన కొడుకును అన్యాయంగా ఇరికించారని ఆవేదన చెందిన రాంబాబు తివారీ (50) జూన్ 4న ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, సిద్ధార్థ్ కుటుంబం ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దతోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశామని స్థానిక ఎస్పీ రాజేశ్ కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన సైనీ ఎస్ హెచ్ఓ, మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామన్నారు.