తిరుపతి: తిరుపతిలోని రామచంద్రాపురం కాలనీలో దారుణం జరిగింది. ఓ వెల్డింగ్ షాప్ లో పనిచేసే ఇద్దరు కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ లో ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో ఈ ఘోరం జరిగింది. తిరుపతి రూరల్ రామచంద్రాపురం కాలనీలోని వెల్డింగ్ షాపు లో తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లాకు చెందిన నటరాజన్ , పద్మావతి పురం కు చెందిన సురేష్ లు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.
ఈ ఆదివారం తెల్లవారు జామున మద్యం మత్తులో ఉన్న వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో నటరాజన్ సురేష్ తలపై రాడ్ తో కొట్టి హత్యకు పాల్పడ్డాడు. సురేష్ తల పగిలి, తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. ఆదివారం ఉదయం షాపు యజమాని ఉమాపతి.. హత్యకు పాల్పడిన నటరాజన్ ను పట్టుకొని తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని తిరుపతి రుయా కు తరలించారు. నటరాజన్ ను అదుపులోకి తీసుకొని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.