భార్య కాపురానికి రావట్లేదని ... కూతుర్ని గొంతు నులిమి చంపేసిండు

భార్య కాపురానికి రావట్లేదని ... కూతుర్ని గొంతు నులిమి చంపేసిండు

కందనూలు, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లాలో భార్య కాపురానికి రాలేదని, 14 నెలల కూతురును గొంతు నులిమి చంపేశాడో తండ్రి. బిజినేపల్లి పోలీసుల కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలం కీమ్య తండాకు చెందిన కేతావత్ తిరుపతి నాయక్, శివలీల భార్యాభర్తలు. వీరికి పెండ్లయి రెండేండ్లవుతుండగా, 14 నెలల కూతురు శశికళ ఉంది.  కొంతకాలం కింద వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడి మియాపూర్​లో ఉంటూ తిరుపతి ఆటో నడుపుకుంటున్నాడు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న తిరుపతి, రోజూ ఆమెతో గొడవపడుతున్నాడు. భరించలేని శివలీల పాపను తీసుకుని మియాపూర్​లోనే కూలి పనులు చేసుకొని బతుకుతున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.

శనివారం సాయంత్రం భార్య వద్దకు వెళ్లిన తిరుపతి, కాపురానికి రావాలని కోరాడు. ఈ క్రమంలో మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. తర్వాత తిరుపతి తన కూతురును తీసుకుని సొంతూరు కీమ్య తండాకు ఆటోలో బయలుదేరాడు. అర్ధరాత్రి తర్వాత దారిలో మద్యం తాగాడు. భార్య మీద కోపంతో కూతురు గొంతు నులిమి చంపేశాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తు దిగాక, అదే ఆటోలో పాప డెడ్​బాడీని తీసుకుని పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. భార్య శివలీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్ నాయక్  తెలిపారు.

గుమ్మడిదలలో కొడుకు చేతిలో తండ్రి..

సంగారెడ్డి జిల్లాలో రోజూ తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని కొట్టి చంపాడో కొడుకు. గుమ్మడిదల పోలీసుల కథనం ప్రకారం.. గుమ్మడిదల మండలం రాంరెడ్డిబావికి చెందిన కృష్ణారెడ్డి(50) ప్రతిరోజు తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ నెల 3న రాత్రి భార్యతో గొడవకు దిగగా, కొడుకు రఘుపతిరెడ్డి కర్రతో కృష్ణారెడ్డి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి బావమరిది బాల్​రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.