- భద్రాచలంలో చెరువులో మునిగి బాలుడు గల్లంతు
- జమ్మికుంటలో కింద పడిన భారీ గణనాథుడు
పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండ లం పాతకారాయిగూడెంలో గణేశ్శోభాయాత్రలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒకరు చనిపోయారు. దూదిపాళ్ల సత్యనారాయణ (50) ఊరిలో బుధవారం రాత్రి నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నాడు. యువకులతో కలిసి డ్యాన్స్ చేస్తూ గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. తిరువూరులోని ప్రైవేట్దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య , కూతురు, కొడుకు ఉన్నారు.
గోదావరికి వెళ్లిన బాలుడు
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరిలో గురువారం జరిగిన నిమజ్జన వేడుకల్లో టేకులపల్లి మండలం వీర్య తండాకు చెందిన 14 ఏండ్ల బాలుడు లకావత్ గణేశ్ గల్లంతయ్యాడు. నిమజ్జనం తర్వాత స్నానం చేసేందుకు ఫ్రెండ్స్ బానోతు రాంచరణ్, బానోతు గణేశ్ తో కలిసి స్నానఘట్టాల వద్ద గోదావరిలో దిగాడు. ముగ్గురూ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు, పోలీసులు, గజ ఈతగాళ్లు చరణ్, బానోతు గణేశ్ను కాపాడారు. లకావత్ గణేశ్ఆచూకీ దొరకలేదు. భద్రాచలంలో బుధవారం రాత్రి శోభాయాత్రలో పటాకులు కాల్చడంతో పాత కూరగాయల మార్కెట్లో ఫుట్ పాత్పై ఉన్న గుడిసెతో పాటు, బార్బర్ షాపులు తగులబడి పోయాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలార్పడంతో ఇతర షాపులకు ముప్పు తప్పింది.
చేతిలో పటాకులు పేలి గాయాలు
వైరా : వైరా మండలంలోని కొణిజర్లలో ఊరేగిం పు సందర్భంగా రాయల నాగయ్య చేతిలో పట్టుకుని పటాకులు పేల్చుతుండగా పేలి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హైదరాబాద్ తరలించారు.
కింద పడిన విగ్రహం ..తప్పిన ప్రమాదం
జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని మోత్కుల గూడెంలో 22 అడుగుల వినాయక విగ్రహం నిమజ్జనం చేసేందుకు తరలిస్తుండగా కింద పడిపోయింది. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ తీగలు అడ్డువస్తున్నాయని క్రేన్తో విగ్రహాన్ని పైకి కిందికి కదుపుతుండగా ట్రాక్టర్ నుంచి కింద పడిపోయింది. అధికారులు, సిబ్బంది విగ్రహాన్ని తాళ్లతో కట్టి క్రేన్ తో నిమజ్జనం చేశారు.