ఇంటి నుంచి బయటకు వెళ్లి.. కారులో విగతజీవిగా

ఇంటి నుంచి బయటకు వెళ్లి.. కారులో విగతజీవిగా

హైదరాబాద్ లో ఓ కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద కమేళా ఓపెన్ గ్రౌండ్లోఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిచి ఉన్న  స్విప్ట్ కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. చనిపోయిన వ్యక్తి అల్వాల్ కు చెందిన విజయ్ భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. ఆయన వయసు దాదాపు 55 ఏళ్లు ఉంటుందన్నారు పోలీసులు. ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

అయితే విజయ్ భాస్కర రెడ్డి మృతి పట్ల అతని కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని నోరు ముక్కు వద్ద గాయాలు కావడం, చెవి వెనుక భాగం నుండి రక్తస్రావం జరుగుతుండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విజయ భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో అతడి మృతికి ఆస్తి తగాదాలే కారణమా లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.