
- హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు
కీసర, వెలుగు: ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయిన వ్యక్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతిచెందాడని ఆరోపిస్తూ హాస్పిటల్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లికి చెందిన మహేశ్యాదవ్ ఆదివారం కీసరలో బొడ్రాయి పండుగ ఉండడంతో బంధువుల ఇంటికి వచ్చాడు. ఒంట్లో బాగలేకపోవడంతో స్థానికంగా ఉన్న నితిన్ హాస్పిటల్కు వెళ్లాడు.
పరీక్షించిన డాక్టర్లు మహేశ్కు ఇంజక్షన్లు ఇచ్చి ట్రీట్ మెంట్ చేశారు. కొద్దిసేపటి తరువాత ఆయనకు నోటిమాట రాకపోవడంతో వెంటనే అక్కడి నుంచి మరో దవాఖానకు తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. కుటుంబసభ్యులు నాగారంలోని ఓ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇంజక్షన్లు ఇచ్చిన అనంతరమే మహేశ్ ఆరోగ్యం విషమంగా మారి మృతిచెందాడని ఆరోపిస్తూ నితిన్ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఫర్నిచర్, ఏసీ ధ్వంసం చేశారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్జామ్ ఏర్పడింది.