పెండ్లి దావత్ ఇచ్చేందుకు వెళ్లి.. వ్యక్తి మృతి..నాలుగు నెలల కిందే పెండ్లి

పెండ్లి దావత్ ఇచ్చేందుకు వెళ్లి.. వ్యక్తి మృతి..నాలుగు నెలల కిందే  పెండ్లి
  •   బాత్రూమ్​లో పడి మృతి

చేవెళ్ల, వెలుగు:  దోస్తులకు పెళ్లి దావత్​కు ఇచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పంజాగుట్ట శ్రీరామ్​నగర్ కాలనీకి చెందిన వెంకట కిశోర్​రెడ్డి(30)కి నాలుగు నెలల కిందే వివాహమైంది. శనివారం ఉద్యోగానికి వెళ్లాడు. సాయంత్రం భార్యకు ఫోన్​కు చేసి తన స్నేహితులు పార్టీ అడుగుతున్నారని, వారికి పార్టీ ఇచ్చి ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడు.

 ఆదివారం ఉదయం 6.30 గంటలకు భర్తకు భార్య ఫోన్ చేయగా.. అతని స్నేహితుడు భవానీ శంకర్ లిఫ్ట్ చేసి, గండిపేటలోని ఫ్రీడమ్ హాస్పిటల్‌లో చేర్చినట్లు తెలిపాడు. వెంటనే ఆమె అక్కడికి వెళ్లగా.. తెల్లవారుజామున 4.20 గంటల సమయంలోనే వెంకట కిశోర్​రెడ్డి మృతిచెందినట్లు డ్యూటీ డాక్టర్లు తెలిపారు. ఏమైందని స్నేహితులను గట్టిగా అడగగా మొయినాబాద్ మున్సిపల్ పరిధి అప్పోజిగూడ లోని ఓ ఫార్మ్ హౌస్‌లో పార్టీ చేసుకున్నామని, వెంకట కిశోర్​రెడ్డి ఎక్కువగా మద్యం తాగి అక్కడే బాత్రూమ్‌లో పడిపోయాడని చెప్పారు. 

రిసార్ట్​లో స్పృహ కోల్పోయి మరొకరు..

వీకెండ్ ట్రిప్​కు వెళ్లిన మరొకరు మృతి చెందాడు. రామంతాపూర్ గాంధీనగర్ కు చెందిన రచ ప్రదీప్(62) నాలుగేళ్లుగా ఉప్పల్ ఐడీఎల్, రామంతాపూర్ వద్ద ఉన్న ఫుజియన్​ హెల్త్​ కేర్, ఇండికో హెల్త్​ కేర్​ ప్రైవేట్​ లిమిటెడ్​లో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. శనివారం కంపెనీ సిబ్బందితో కలిసి మొయినాబాద్​ మున్సిపల్​పరిధి ఎన్కెపల్లిలోని ఓ రిసార్ట్ కు వెళ్లాడు. అందరూ అక్కడే నిద్రించారు.

ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో అతని సహోద్యోగి ప్రతాప్​ కొడుకు నరేశ్​కు ఫోన్​చేసి.. మీ నాన్న పడుకున్న దగ్గరే స్పృహ కోల్పోయాడని, నోటిలో నుంచి నురగలు వస్తున్నట్లు చెప్పాడు. ప్రదీప్​ను కొండాపూర్ ప్రభుత్వ హాస్పిటల్​కు తీసుకెళ్లగా డ్యూటీ డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు 
చేస్తున్నారు.