వైరల్ వీడియో: మద్యం మత్తులో పామును కొరికి చంపిన వ్యక్తి

వైరల్ వీడియో: మద్యం మత్తులో పామును కొరికి చంపిన వ్యక్తి

చాలా రోజుల తర్వాత మందు దొరికిందన్న సంతోషంతో ఇంటికి వస్తున్న వ్యక్తికి పాము అడ్డొచ్చిందని కోపంతో కొరికి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. లాక్డౌన్ వల్ల నిన్నటివరకు మద్యం షాపులు బంద్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కొన్ని సడలింపులతో కర్ణాటక ప్రభుత్వం వైన్ షాపులు తెరవడానికి అనుమతులిచ్చింది. దాంతో సోమవారం నుంచి అక్కడ వైన్ షాపులు తెరచుకున్నాయి.

కోలార్ జిల్లాలోని ములబాగిలు తాలూకాలోని ముస్తూరు గ్రామానికి చెందిన కుమార్ భవన నిర్మాణ కార్మికుడు. మద్యం షాపులు తెరచుకోవడంతో కుమార్ మంగళవారం మందు కొనుక్కొని ఇంటికి వస్తున్నాడు. అప్పటికే కుమార్ మందు తాగి ఉన్నాడు. కుమార్ బైక్ పై ఇంటికి వస్తుండగా.. పాము అతని బైకుకు అడ్డొచ్చింది. దాంతో కోపోద్రిక్తుడైన కుమార్.. మద్యం మత్తులో పామును తీసుకొని మెడలో వెసుకున్నాడు. అలా కొంతదూరం వెళ్లిన తర్వాత.. బైక్ ఆపి పామును నోటితో పట్టుకొని.. దాని చర్మం ఊడదీసి చంపాడు. ఆ ఘటనను చూసిన చుట్టుపక్కల వాళ్లంతా భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికులు కుమార్ ను ఎంత వారించినా.. వినకుండా పామును నోటితో కొరికి కొరికి చంపేశాడు. పాముకు భయపడి చుట్టు పక్కలవాళ్లు ఎవరూ కుమార్ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించలేదు. పామును చంపిన తర్వాత కుమార్ క్షేమంగానే ఉన్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో.. మరోసారి ఇలా చేయవద్దని కుమార్ ను పోలీసులు హెచ్చరించారు.