ఢిల్లీలోని నజాఫ్గఢ్ స్టేషన్లో కదులుతున్న మెట్రో రైలు కింద దూకి 31 ఏళ్ల లైబ్రేరియన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజఫ్గఢ్ లోని ప్రేమ్నగర్కి చెందిన మనీష్కుమార్ ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్లో లైబ్రేరియన్ గా పని చేస్తున్నారు.
నజఫ్గఢ్లో ఓ వ్యక్తి మెట్రో ముందు దూకి చనిపోయినట్లు జులై 31 ఉదయం పోలీసులుకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుడేజీలను పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.
మృతుడికి వివాహమై ఒక కుమార్తె ఉందని సీనియర్అధికారి ఒకరు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తరచూ ఆత్మహత్యలు..
ఈ నెల ప్రారంభంలో, కైలాష్ కాలనీ స్టేషన్లో మెట్రో రైలు ముందు దూకి 25 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడిని అజయ్ అర్జున్ శర్మగా గుర్తించారు. జూన్లో కూడా ఇక్కడ మెట్రో రైలు ముందు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారం కావని.. అందరూ ధైర్యంగా ఉంటూ జీవితంలో పోరాడాలని అధికారులు కోరుతున్నారు.