మాజీ ఐపీఎస్ ఇంటి ఎదుట యువకుడి రచ్చ... రోడ్డును బ్లాక్ చేసే అధికారం ఎవరిచ్చారంటూ ఫైర్

మాజీ ఐపీఎస్ ఇంటి ఎదుట యువకుడి రచ్చ... రోడ్డును బ్లాక్ చేసే అధికారం ఎవరిచ్చారంటూ ఫైర్
  • వీకే సింగ్ ​ఇంటి ఆవరణలోకి వెళ్లి రచ్చ
  • గత నెల 30న ఘటన.. ఆలస్యంగా ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు : ‘రోడ్డును బ్లాక్ చేసేందుకు అధికారం ఎవరిచ్చారు’ అంటూ ఓ యువకుడు మాజీ ఐపీఎస్​ఆఫీసర్​ఇంటి ఎదుట రచ్చ చేశాడు. ఇంట్లోకి వెళ్లి న్యూసెన్స్​చేశాడు. దీంతో అతడిపై జూబ్లీహిల్స్​పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7 ప్రశాసన్ నగర్ ప్లాట్ నంబర్ 49లో మాజీ ఐపీఎస్ ఆఫీసర్​వీకే సింగ్​ఉంటున్నారు. 

వీకే సింగ్ ఇంటికి ఎదురుగా రోడ్డు నిర్మాణంలో ఉండగా కాంట్రాక్టర్​బారికేడ్లు ఏర్పాటు చేశాడు. గత నెల 30న అర్ధరాత్రి ఒంటి గంటకు ఇదే ప్రాంతానికి చెందిన ఫ్లాట్ నంబర్ 40లో ఉండే తబ్రేజ్ అనే యువకుడు కారులో ఆ రూట్​లో వెళ్తున్నాడు. 

అక్కడ బారికేడ్లు పెట్టి ఉండడంతో రోడ్డును ఎందుకు బ్లాక్ చేశారంటూ గొడవకు దిగాడు. వీకే సింగ్​ఇంటి మెయిన్​ గేటును బలంగా కొట్టాడు. సెక్యూరిటీ జస్వంత్ కుమార్ గేటు తీయగా పార్కింగ్ ఏరియాలోకి ప్రవేశించి బూతులు తిట్టాడు. ఇది విన్న వీకే సింగ్​బయటకు రాగా, ‘ఇప్పటికిప్పుడు 500 మందిని పిలిచి, ఇంటిని, వాహనాలను ధ్వంసం చేయిస్తా’ అని హెచ్చరించాడు. అయితే, ఘటన గత నెల 30న జరగ్గా, గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో వీకే సింగ్​సెక్యూరిటీ జస్వంత్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.