వరంగల్ : నా చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కారణమంటూ లెటర్ రాసి ఓ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన మంగళవారం హన్మకొండలో జరిగింది. అదాలత్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చాకుతో గొంతు కోసుకొని అక్కడే పడుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని వరంగల్ అర్బన్ జిల్లా అలంకాని పేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతడి బ్యాగులో ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే కారణమని అందులో రాశాడు వెంకటేశ్వర్లు. వచ్చే ఎన్నికల్లో సుదర్శణ్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని సీఎం కేసీఆర్కు సూసైడ్ నోట్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.
అయితే అమరవీరుల స్థూపం ముందు ఎందుకు ఆత్మాహత్యాయత్నం చేశాడు.. దానికి ఎమ్మెల్యే ఎందుకు కారణం.. అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా స్పందించారు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.