
కోల్కతా: శర్మిష్ఠ పనోలి.. ఈ యువతి పేరు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, లా స్టూడెంటైన శర్మిష్ఠ సోషల్ మీడియాలో ఆపరేషన్ సిందూర్ గురించి స్పందిస్తూ ఓ వర్గాన్ని టార్గెట్ చేసి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కోల్కతా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే.. శర్మిష్ఠపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అనే యువకుడు కనిపించకుండా పోవడంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. షర్మిష్టపై కంప్లైంట్ చేసిన తన కుమారుడు వజాహత్ ఖాన్ ఆదివారం (జూన్ 1) నుంచి కనిపించడం లేదని ఫిర్యాదుదారుడు తండ్రి సాదత్ ఖాన్ ఓ నేషనల్ మీడియా ఛానెల్కు వెల్లడించాడు. నా కొడుకు అమాయకుడని.. అతడు ఒక లౌకికవాది అని అన్నాడు. నా కొడుకు హిందూ మతాన్ని ఎప్పుడు అవమానించలేదని.. శర్మిష్ఠ అరెస్టు అయినప్పటి నుండి మాకు బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు.
అసలు ఏం జరిగిందంటే..?
శర్మిష్ఠ పనోలి మే 14, 2025న తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ.. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. ఆమె ఇస్లాం మతంపై, PBUHపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆపరేషన్ సిందూర్పై మౌనంగా ఉన్న బాలీవుడ్ యాక్టర్లపై యువతి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమన్నారు. #ArrestSharmishta అనే హ్యాష్ ట్యాగ్ ‘ఎక్స్’లో ట్రెండ్ అయింది. శర్మిష్ఠ పనోలిపై చర్యలు తీసుకోవాలని వజాహత్ ఖాన్ కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కోల్ కతా పోలీసులు శర్మిష్ఠను గురుగ్రామ్ లో అదుపులోకి తీసుకుని కోల్ కతా తరలించారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు.