
- డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
- కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదేశించినా పట్టించుకోని బ్యాంకులు
- వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్న గిరిజన రైతులు
మంచిర్యాల, వెలుగు: పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా బ్యాంకర్లు క్రాప్ లోన్లు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం సీజన్ ముంచుకురావడంతో పంట పెట్టుబడుల కోసం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల కింద ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్ కింద పట్టాలు ఇచ్చింది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో 2,500 ఎకరాలకు పట్టాలు జారీ చేశారు. జిల్లాలోని బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, చెన్నూర్, కోటపల్లి, దండేపల్లి, జన్నారం తదితర మండలాల్లోని రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఈ పట్టాలను ధరణి పోర్టల్లో ఎంట్రీ చేయకపోవడంతో రైతులకు చిక్కొచ్చింది. ఆన్లైన్లో ఉన్న పట్టాలకే క్రాప్లోన్లు ఇవ్వాలనే రూల్ ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. పోడు భూములు ఆన్లైన్లో లేకపోవడంతో వాటికి క్రాప్లోన్లు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు.
డిప్యూటీ సీఎంను కలిసినా..
పోడు భూములకు క్రాప్ లోన్లు ఇప్పించాలని రైతులు గత రెండేండ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించే గ్రీవెన్స్లో నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్కు ఫిర్యాదు చేశారు. అలాగే మంచిర్యాల కలెక్టర్ను, ఉట్నూర్ ఐటీడీఏ పీవోను కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన అధికారులు పోడు భూములకు క్రాప్ లోన్లు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశింశారు. బ్యాంకర్లను కలిస్తే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప లోన్లు ఇవ్వలేమని చెబుతున్నారని వాపోతున్నారు.
వచ్చే లాభం మిత్తికే..
సాగు ఖర్చులు ఏటేటా పెరుగుతుండడంతో పెట్టుబడుల కోసం గిరిజన రైతులు తిప్పలు పడుతున్నారు. బ్యాంకర్లు క్రాప్లోన్లు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు రైతుల దగ్గర 5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలకు ఎకరానికి రూ.30 వేలకు పైగా ఖర్చవుతోంది. ఐదెకరాలు ఉన్న రైతు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర అప్పు చేయాల్సిన పరిస్థితి. రూ.లక్ష అప్పు తీసుకుంటే నెలకు రూ.5వేల చొప్పున ఆరేడు నెలలకు రూ.30 నుంచి రూ.35 వేలు మిత్తి అవుతోంది. పైగా పండిన పంటను తమకే అమ్మాలనే షరతుపై వ్యాపారులు అప్పులు ఇస్తున్నారు. దీంతో వ్యాపారులు చెప్పిన రేటుకే పంటను అమ్ముకొని నష్టపోతున్నారు. ఇలా ఆరుగాలం కష్టపడితే వచ్చే లాభం మిత్తికే పోతోందని, తమకు రోజు కూలీ సైతం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం లోన్లు ఇప్పించాలె..
పోడు భూములకు బ్యాంకర్లు క్రాప్ లోన్లు ఇస్తలేరు. పట్టాలు ఆన్లైన్లో ఉంటేనే లోన్లు ఇస్తాం అంటున్నరు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినం. ప్రజాభవన్లో జరిగే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినం. కలెక్టర్, ఐటీడీ పీవోను కలిసినం. అయినా ఫలితం లేదు. అధికారులు చెప్పినా బ్యాంకర్లు లోన్లు ఇస్తలేరు.
ఎర్మ పున్నం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
5 శాతం వడ్డీకి అప్పు తీసుకున్న..
నాకు ఏడెకరాల పోడు పట్టా ఉంది. 2023లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు పట్టాలు ఇచ్చింది. రెండేండ్ల నుంచి క్రాప్లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. లోన్లు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల దగ్గర 5 శాతం మిత్తికి అప్పులు తెచ్చి వరి, పత్తి పంటలు వేస్తున్నా. ఖర్చులు, మిత్తి పోను మాకు కూలీ కూడా పడ్తలేదు.
కొమురెల్లి మల్లయ్య, చామనపల్లి, వేమనపల్లి
కష్టమంతా అప్పులు, వడ్డీలకే..
మేము ఏండ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నం. రెండేండ్ల కింద ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అయినా బ్యాంకులో లోన్లు ఇస్తలేరు. షావుకార్ల దగ్గర అప్పు తెచ్చి ఎల్లదీస్తున్నా. మా కష్టమంతా అప్పులు, వడ్డీలకే పోతుంది. కలెక్టర్ సార్ స్పందించి మాకు బ్యాంకు లోన్లు ఇప్పించాలె.
తలండి మత్తయ్య, సూపాక, కోటపల్లి