- కుటుంబ పోషణకు మంచిర్యాల జిల్లా దండేపల్లి వాసి కష్టాలు
- బాధలు చెప్పుకునేందుకు కేసీఆర్, కేటీఆర్ అపాయింట్మెంట్ఇవ్వలేదని ఆవేదన
మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్కు ఇంట్లో గుడి కట్టి పూజలు చేసిన ఓ వీరాభిమాని.. కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టారు. పార్టీ కోసం ఎంతో కష్టపడితే తన బాధలు చెప్పుకునేందుకు కూడా కేసీఆర్, కేటీఆర్అవకాశం ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకు విగ్రహాన్ని అమ్మేందుకు సిద్ధమయ్యారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా రవీందర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు జైకొట్టారు. 35కు పైగా బైండోవర్ కేసులు పెడితే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. 2012లో దండేపల్లిలో సొంత ఖర్చులతో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు పెట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2016లో కేసీఆర్కు తన ఇంట్లో గుడి కట్టి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రోజూ పూజలు చేశారు. తనకున్న రెండెకరాల భూమి అమ్మి దండేపల్లి మండలం మ్యాదరిపేటలో కేబుల్ఆపరేటర్గా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ను 2018లో అక్రమంగా మరొకరు లాక్కోవడంతో రోడ్డున పడ్డారు. దీంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు దీక్ష చేసినా, సెల్టవర్ ఎక్కినా ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్, కేటీఆర్లను కలిసి తన బాధలు చెప్పుకునేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ప్రగతిభవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశారు. అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లు కాపాడారు. పార్టీ కోసం కష్టపడితే తనకు గుర్తింపు దక్కలేదంటూ ఈ ఏడాది జనవరిలో కేసీఆర్ విగ్రహానికి ముసుగు కప్పి నిరసన తెలిపారు. పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అప్పులు తీర్చేందుకు, కుటుంబ పోషణ కోసం ఆ విగ్రహాన్ని ఆదివారం ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టానని చెప్పారు.