తిరుమల శ్రీవారిని నూతన వధూవరులు మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డిలు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు లక్ష్మీ దంపతులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం నూతన వధూవరులకు వేదపండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రేమ గెలిచింది..
మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం సంతోషంగా ఉందని మంచు మనోజ్ అన్నారు. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ.. ప్రేమలో కాదన్నారు. నేడు తమ ప్రేమ గెలిచిందని చెప్పారు. నాన్న ఆశీస్సులు, అక్క సపోర్టు, అత్తమామల ఆశీస్సులు ఉన్నంత వరకు తమను ఎవరు ఏమీ చేయలేరన్నారు.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు..కానీ
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని మంచు మనోజ్ అన్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉందన్నారు. మౌనిక కూడా సేవ చేయాలని ఉంటే ఆమెకు తన సపోర్టు ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు..అలా తన జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చిందన్నారు. నాలుగేళ్లుగా ఏదో లోకంలో ఉన్న తనను మౌనిక సాధారణ మనిషిని చేసిందన్నారు. బాబు తాను మౌనిక రెడ్డిలు నూతన జీవితంలోకి అడుగుపెట్టామన్నారు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటే ఇదేనేమో అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే కొత్త సినిమా షూటింగ్స్లో పాల్గొంటానని చెప్పుకొచ్చారు.