మనోజ్​ మెడ, కాళ్లకు గాయాలు, వాపు.. గొడవపై మోహన్ బాబు ఏమన్నారంటే..

మనోజ్​ మెడ, కాళ్లకు గాయాలు, వాపు.. గొడవపై మోహన్ బాబు ఏమన్నారంటే..
  • హీరో మోహన్ బాబు ఇంట్లో గొడవలు
  • 100కు కాల్​చేసిన మనోజ్​
  • తామే పరిష్కరించుకుంటామని  చెప్పిన మోహన్​బాబు  
  • వెనుదిరిగిన పోలీసులు
  • గాయాలతో బంజారాహిల్స్​దవాఖానకు మనోజ్

బడంగ్ పేట్ /జూబ్లీహిల్స్​, వెలుగు : సినీ నటుడు మోహన్​బాబు కుటుంబంలో గొడవలు భగ్గుమన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫాంహౌస్​లో ఉంటున్నారు. ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్​100 కు ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు.

తమ కుటుబంలో విబేధాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్​బాబు చెప్పడంతో వెళ్లిపోయారు. కాగా, సాయంత్రం మనోజ్​బంజారాహిల్స్​రోడ్డు నంబరు 12లోని టీఎక్స్​ దవాఖానకు తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. మనోజ్​మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందని ట్రీట్మెంట్​చేసిన డాక్టర్లు చెప్పారు. మెడ తిప్పలేకపోతున్నాడని చెప్పారు.

సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్​తో పాటు ఎక్స్​రే తీశారు.  పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. 24  గంటలు పాటు అబ్వర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పగా, సోమవారం మళ్లీ వస్తానని వెళ్లిపోయారని తెలిసింది. దీనిపై మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డిని వివరణ కోరగా 100 డయల్​కు కాల్ వచ్చిందని, పోలీసులు విచారణ జరిపారని, కుటుంబ గొడవ అని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.